దేశంలో కరోనా: 56వేలు దాటిన కేసులు.. గత 24 గంటల్లో 5వేల మందికి పాజిటివ్

దేశంలో కరోనా ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 5వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 56,300 దాటింది. వీరిలో 16,776 మంది కోలుకోగా.. 1,889 మంది మృత్యువాతపడ్డారు. మరో 37,916 మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 5,000 వేల మంది వైరస్ బారినపడగా.. అత్యధికంగా మహారాష్ట్రలో 1,323 కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా మరో 130 మంది మరణించారు. అత్యధికంగా మహారాష్ట్రలో 40 మంది, గుజరాత్‌లో 30 మంది ప్రాణాలు కోల్పోయారు.

దేశంలోని మొత్తం మరణాల్లో 69.66 శాతం ఈ రెండు రాష్ట్రాల్లోనే సంభవించాయి. బుధవారంతో పోలిస్తే గురువారం నాటికి కేసుల సంఖ్యలో 7.20 శాతం, మరణాల్లో 5.25 శాతం, కోలుకున్నవారిలో 7.64 శాతం వృద్ధి నమోదైంది. ఇప్పటివరకూ వైరస్‌ సోకినవారిలో 3.36% మంది మరణించగా, 28.83% మంది కోలుకున్నారు.

కరోనా వైరస్‌పై ముందుండి పోరాటం చేస్తున్న వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, భద్రతా సిబ్బంది కొవిడ్‌-19 బారిన పడడం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్రలో ఏకంగా 531 మంది పోలీసులు కొవిడ్‌-19 బారిన పడ్డారు. వీరిలో 51 మంది అధికారులు, 480 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. 531 మందిలో 39 మంది కోలుకున్నట్లు అధికారులు చెప్పారు.

ముంబయిలో ఆర్థర్‌ రోడ్‌ జైలులో 72 మంది ఖైదీలు, ఏడుగురు సిబ్బందికి కరోనా సోకినట్లు గురువారం నిర్ధారణ అయింది. దీంతో ఖైదీలను ముంబయిలోని జీటీ ఆసుపత్రి, సెయింట్‌ జార్జ్‌ ఆసుపత్రులకు తరలించారు. జైల్లోని వంట మనిషి ద్వారా వీరికి కరోనా సోకినట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్‌లో 56 మందికి కొత్తగా వైరస్‌ సోకింది. దీంతో కేసుల సంఖ్య 1,833కి చేరింది. మరో ఇద్దరు మరణించగా మొత్తం మృతుల సంఖ్య 38కి పెరిగింది. ఇప్పటి వరకు 780 మంది కోలుకున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. విశాఖపట్నం జిల్లాలో ఏడుగురు, విజయనగరం జిల్లాలో ముగ్గురు కొవిడ్‌-19 బారిన పడ్డారు.

తెలంగాణలో గురువారం మరో 15 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో 12 జీహెచ్‌ఎంసీ పరిధిలోనివి కాగా, మూడు నల్గొండ జిల్లాకు సంబంధించినవి. నల్గొండకు చెందిన నలుగురు పనుల కోసం రెండు నెలల కిందట ముంబయికి వలస వెళ్లారు. ఈ నెల 4న ముంబయి నుంచి ఇక్కడికి వచ్చిన ఆ వలస కూలీలకు పరీక్షలు నిర్వహించడంతో తాజాగా ముగ్గురిలో పాజిటివ్‌గా, మరొకరిలో నెగిటివ్‌గా నిర్ధారణ అయింది. మొత్తంగా బాధితుల సంఖ్య 1122కు పెరిగింది.

మహారాష్ట్ర (17,979), గుజరాత్ (7,013), ఢిల్లీ (5,980), రాజస్థాన్ (5,405), మధ్యప్రదేశ్ (3,252), ఉత్తరప్రదేశ్ (3,071), ఆంధ్రప్రదేశ్ (1,833), పంజాబ్ (1,644), పశ్చిమ్ బెంగాల్ (1,548), తెలంగాణ (1,122) కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా మహారాష్ట్రంలో 694 మంది ప్రాణాలు కోల్పోగా, తర్వాత గుజరాత్ (425), మధ్యప్రదేశ్ (193), పశ్చిమ్ బెంగాల్ (151), రాజస్థాన్ (99), ఢిల్లీ (66), ఉత్తప్రదేశ్ (62), ఆంధ్రప్రదేశ్ 38), తమిళనాడు (37), కర్ణాటక (30), తెలంగాణ (29), పంజాబ్ (29) ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here