తల్లి బతికుండగానే నిప్పుపెట్టిన కొడుకు.. ఆదిలాబాద్ జిల్లాలో దారుణం

జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. మద్యం మత్తులో కన్నతల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడో దుర్మార్గపు కొడుకు. డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఘాతుకానికి పాల్పడ్డాడు. ఒంటికి మంటలు అంటుకుని తీవ్రగాయాలపాలైన వృద్ధురాలిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

జైనథ్ గ్రామంలోని వడ్డెర కాలనీకి చెందిన లసుంబాయి(60)కి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు సంతానం. భర్త గతంలోనే చనిపోవడంతో ఒంటరిగానే జీవిస్తోంది. తనకున్న ఐదెకరాల పొలం కౌలుకి ఇచ్చుకుని వచ్చే డబ్బుతో కాలం వెళ్లదీస్తోంది. ఆ డబ్బుపై పెద్ద కొడుకు నాందేవ్ కన్నుపడింది. ఒంటరిగా ఉంటున్న తల్లి వద్దకెళ్లి కౌలు డబ్బుల గురించి గొడవపడుతుండేవాడు.

Also Read:

ఇటీవల తన తల్లికి కౌలు డబ్బులు వచ్చిన విషయం తెలుసుకున్న నాందేవ్ తల్లితో గొడవపడ్డాడు. కౌలు డబ్బులు ఇవ్వాలంటూ మద్యం మత్తులో వాదనకు దిగాడు. అందుకు తల్లి లసుంబాయి ససేమిరా అనడంతో ఆగ్రహంతో దారుణానికి పాల్పడ్డాడు. తల్లి ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంటల్లో కాలిపోతున్న లసుంబాయిని చూసిన ఆమె కూతురు, కోడలు, స్థానికులతో కలసి మంటలను ఆర్పివేశారు.

మంటల్లో కాలిపోయి తీవ్రగాయాలపాలైన లసుంబాయిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. కొడుకు నాందేవ్, పెట్రోల్ అందించిన అతని భార్య దీపికపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here