ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు

దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున తిక్రీ బోర్డర్‌ ఏరియాలోని ప్లాస్టిక్ సామాన్ల గొడౌన్‌లో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. మంటలు భారీగా ఎగసి పడుతుండటంతో అగ్నిమాపక సిబ్బంది 30 ఫైర్‌ ఇంజన్లతో మంటలను ఆర్పుతున్నారు. గోదాం చుట్టు పక్కల ప్రాంతాలు మొత్తం దట్టమైన పొగలు అలముకోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ముందుజాగ్రత్త చర్యగా చుట్టుపక్కల ఇళ్లను ఖాళీచేయించిన అధికారులు.. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

గోదాములో బట్టలు, ప్లాస్టిక్ వస్తువులు ఉన్న కారణంగా మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టంగా పొగ అల్లుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు ఎవరైనా లోపల ఉన్నారా? అనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలిసిరాలేదు. షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. మంటలను అదుపుచేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ఢిల్లీలో తరుచూ అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. గతేడాది డిసెంబరులో భారీ అగ్ని ప్రమాదం సంభవించి, 44 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఝాన్సీ రోడ్డులోని అనాజ్‌ మండీలోని ఓ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి.. 44 మంది చనిపోయారు. మరో 50 మందికిపైగా గాయపడ్డారు. అందరూ గాఢనిద్రలో ఉన్నప్పుడు ఈ ప్రమాదం జరగడంతో అగ్నికి ఆహుతయ్యారు. ఘటనా స్థలంలోనే 30 మంది వరకు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here