ఘోర తప్పిదం.. సొంత యుద్ధ నౌకపై ఇరాన్ క్షిపణి దాడి.. 19 మంది మృతి

మిస్సైల్ పొరబాటున తమ దేశానికి చెందిన యుద్ధ నౌకపై దాడి చేసింది. దీంతో యుద్ధ నౌకలో ఉన్న 19 మంది ప్రాణాలు కోల్పోగా 15 మంది గాయపడ్డారు. గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో సైనిక శిక్షణ విన్యాసాలు నిర్వహిస్తోన్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టెహ్రాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో ఇటీవలి కాలంలో ఇరాన్ తరచుగా సైనిక విన్యాసాలు చేపడుతోంది. టెహ్రాన్‌ను 790 మైళ్ల దూరంలోని పోర్ట్ ఆఫ్ జాస్క్‌లో ఆదివారం ఈ ఫ్రెండ్లీ ఫైర్ చోటు చేసుకుంది.

తమ మిస్సైల్ ప్రమాదవశాత్తూ కోణార్క్ నౌకను ఢీకొట్టిందని ఇరాన్ స్టేట్ టెలివిజన్ తెలిపింది. పోర్చుగల్ రూపొందించిన కోణార్క్ యుద్ధనౌక పొడవు 47 మీటర్లు, సామర్థ్యం 40 టన్నులు. 1988 నుంచి సేవలు అందిస్తోన్న ఈ యుద్ధనౌకకు 2018లో మరమ్మతులు చేశారు. ఈ నౌకలో 20 మంది సిబ్బంది ఉంటుంటారు.

ప్రపంచంలోని చమురు రవాణాలో 20 శాతం వాటా ఇరుకైన పర్షియన్ గల్ఫ్ గుండా జరుగుతోంది. దీనికి అత్యంత చేరువలోని వ్యూహాత్మక హార్మూజ్ జలసంధి సమీపంలో ఇరాన్ తరచుగా విన్యాసాలు చేపడుతోంది. సైనిక విన్యాసాల సందర్భంగా ప్రమాదాలు చోటు చేసుకున్నప్పటికీ.. ఇరాన్ మీడియా అరుదుగా కథనాలను ప్రసారం చేస్తుంది. తాజా ప్రమాదాన్ని ఆ దేశ టెలివిజన్లు ప్రసారం చేయడాన్ని బట్టి ప్రమాద తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

ఈ ఏడాది జనవరిలో ఇరాన్ పొరబాటున ఉక్రెయిన్‌కు చెందిన విమానాన్ని కూల్చి వేసింది. ఈ ఘటనలో 176 మంది చనిపోయారు. అనంతరం ఇరాన్ తన తప్పిదాన్ని అంగీకరించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here