కొత్త పన్నాగానికి తెరతీసిన పాక్.. కశ్మీర్‌లోకి కోవిడ్ సోకిన ఉగ్రవాదులు: డీజీపీ

ఇప్పటి వరకూ ఉగ్రవాదులను ఎగదొస్తూ కుతంత్రాలకు పాల్పడిన దాయాది.. ప్రస్తుతం దేశంలోకి కరోనా వైరస్‌ వ్యాప్తికి పాకిస్థాన్‌ కుట్రలకు తెరతీసిందని జమ్మూ కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్‌ సోకిన ఉగ్రవాదులను జమ్మూ కశ్మీర్‌కు పంపుతోందని.. తద్వారా అక్కడ కోవిడ్-19ను వ్యాప్తి చేయాలని దాయాది పన్నాగం పన్నిందని ఆరోపించారు. శ్రీనగర్ సమీపంలోని గందర్బాల్ జిల్లాలోని ఓ క్వారంటైన్ కేంద్రాన్ని బుధవారం పరిశీలించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ… పై విధంగా స్పందించారు.

‘కశ్మీర్ లోయలోకి కరోనా వైరస్ సోకినవారిని చేరవేస్తోందనేది నిజం. ఈ విషయాన్ని మేం గుర్తించాం. ఇప్పటిదాకా ఉగ్రవాదులనే కశ్మీర్‌కు పంపిన పాక్.. ఇప్పుడు కశ్మీర్ ప్రజలకు వైరస్ అంటించేందుకు రోగులను చేరవేస్తోంది. ఈ విషయంలో మేం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది’ అని అయన పేర్కొన్నారు. ఇదే సమయంలో 4,000 మంది ఉగ్రవాదుల పేర్లను నిఘా పరిధి నుంచి పాక్ తొలగించిందని, వీరిలో 2008 ముంబయి మారణహోమం సూత్రధారులు సైతం ఉన్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకున్నట్టు దిల్బాగ్ సింగ్ తెలిపారు. భారత్ సహా ప్రపంచంలోని అనేక దేశాల్లో దాడులకు ఉగ్రవాదులను పాక్ పంపుతోందని ఆయన దుయ్యబట్టారు.

పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) మీదుగా కరోనా రోగులను సరిహద్దు దాటిస్తున్నట్టు నిఘా వర్గాల ద్వారా సమాచారం అందినట్టు కొన్ని వారాల కిందటే ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పీఓకేలో ఇప్పటిదాకా 50 మంది కరోనా వైరస్ బారినపడగా… వారంతా మీర్పూర్ జిల్లాకు చెందినవారే. ఏప్రిల్ తొలివారంలో కేరన్ సెక్టార్ నుంచి భారత్‌లోకి చొరబడేందుకు ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాన్ని ఆర్మీ తిప్పికొట్టింది. ఈ దాడుల్లో ఐదుగురు జవాన్లు అమరులు కాగా.. తొమ్మిది మంది ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. అప్పటి నుంచి వాస్తవాధీన రేఖ వద్ద భారత్, పాక్‌ ఆర్మీ మధ్య తరచూ కాల్పులు జరుగుతున్నాయి.

గతవారం జమ్మూ కశ్మీర్‌లో పర్యటించిన ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణే.. పాకిస్థాన్‌పై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. భారత్ సహా ప్రపంచమంతా కరోనా వైరస్‌తో పోరాటం చేస్తుంటే, పాకిస్థాన్ మాత్రం ఉగ్రవాదాన్ని దేశంలోకి ఎగదోస్తోందని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే దుయ్యబట్టారు. మన సొంత పౌరులకే సాయం చేయడమేకాదు.. మిగతా దేశాలకు కూడా వైద్య బృందాన్ని పంపి, ఔషధాలను ఎగుమతి చేస్తూ తీరికలేకుండా ఉంటే.. పాకిస్థాన్ మరోవైపు ఉగ్రవాదులను దేశంలోకి పంపుతోందని విమర్శించారు. శుక్రవారం జమ్మూ కశ్మీర్‌లో పర్యటించిన ఆర్మీ చీఫ్.. సరిహద్దుల్లో చేపట్టిన ఆపరేషన్‌లపై సమీక్ష నిర్వహించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here