కూతురికి నిద్రమాత్రలిచ్చిన తల్లి.. మత్తులోకి జారుకున్నాక..

తన కూతురు కనపించడం లేదంటూ ఓ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు పక్క ఊరికి చెందిన ఓ వ్యక్తిపై అనుమానం ఉందని చెప్పింది. మరుసటి రోజే ఆమె మళ్లీ పోలీసులను సంప్రదించింది. రైల్వే స్టేషన్‌లో తన కూతురు దొరికిందని.. ఇంటికి తీసుకొచ్చేసినట్లు చెప్పింది. అయితే అనుమానం వచ్చిన పోలీసులు ఆరా తీయడంతో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ప్రేమించిందన్న కారణంతో కన్నకూతురిని కుటుంబ సభ్యులతో కలసి దారుణంగా హత్య చేసి తగులబెట్టేసినట్లు తేలింది. ఈ దారుణ ఘటన పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో వెలుగుచూసింది.

యువతిని దారుణంగా చంపేసి గుట్టుచప్పుడుకాకుండా తగలబెట్టేసిన దారుణ ఘటన చోటుచేసుకుంది. గఢ్‌శంకర్ పరిధిలోని సౌలి గ్రామానికి చెందిన బల్వీందర్ కౌర్ తన కూతురు జస్‌ప్రీత్ కౌర్(19) కనిపించడం లేదంటూ ఈ నెల 22న పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమకు చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయిందని చెప్పింది. సమీపంలోని భజ్‌లాన్ గ్రామానికి చెందని అమన్‌ప్రీత్ సింగ్ అలియాన్ అమన్ అనే యువకుడిపై అనుమానం ఉందని పేర్కొంది.

Also Read:

ఆ మరుసటి రోజే బల్వీందర్ తన కూతురు ఆచూకీ తెలిసిందని.. గఢ్‌శంకర్ రైల్వే స్టేషన్‌లో కనిపిస్తే ఇంటికి తీసుకొచ్చినట్లు పోలీసులకు చెప్పింది. అనుమానం వచ్చిన పోలీసులు విచారణ చేపట్టడంతో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. తల్లి బల్వీందర్ మరిది సత్యదేవ్ సింగ్, అతని కుమారులతో కలసి దారుణానికి ఒడిగట్టింది. పరువు పోయిందని రగిలిపోయిన కుటుంబ సభ్యులు ఆమెను కిరాతకంగా చంపేసినట్లు తేలింది.

ఇంటికి తీసుకొచ్చిన తర్వాత రాత్రివేళ కూతురు జస్‌ప్రీత్‌ కౌర్‌కి తల్లి బల్వీందర్ నిద్రమాత్రలు ఇచ్చి పడుకోబెట్టింది. ఆమె మత్తులోకి జారుకున్నాక సోదరుడు శివ్‌రాజ్ అతని అనుచరుడు లల్లా కలసి ఆమె గొంతుపిసికి దారుణంగా చంపేశారు. ఊపిరాడకుండా చేసి అంతమొందించారు. అనంతరం తల్లి బల్వీందర్, బాబాయ్ సత్యదేవ్, సోదరులు గురుదీప్ సింగ్, శివ్‌రాజ్, అనుచరుడు లల్లా కలసి జస్‌ప్రీత్ శవాన్ని మాయం చేశారు. మృతదేహాన్ని ఊరికి సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లి తగులబెట్టేశారు.

Read Also:

పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతురాలి అస్తికలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించారు. ఈ కేసులో కసాయి తల్లి బల్వీందర్, బాబాయ్ సత్యదేవ్, సోదరుడు గురుదీప్ సింగ్‌ని అదుపులోకి తీసుకున్నారు. గురుదీప్ పోలీస్‌ శాఖలో విధులు నిర్వర్తిస్తున్నాడు. సీఎం సెక్యూరిటీ వింగ్‌లో పనిచేస్తున్నట్లు తేలింది. పరారీలో ఉన్న నిందితులు శివ్‌రాజ్‌, అతని అనుచరుడు లల్లా కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులపై పరువు హత్య, ఆధారాలు నాశనం చేసేందుకు ప్రయత్నించిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here