కరోనా వైరస్ లైవ్ అప్‌డేట్స్: 9 రోజుల్లోనే 20వేలపైగా పాజిటివ్ కేసులు

⍟ దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నాయి. లాక్‌డౌన్ కొనసాగుతున్నా మహమ్మారి తీవ్రత మాత్రం తగ్గడం లేదు. కోవిడ్ -19 పాజిటివ్ కేసుల సంఖ్య వృద్ధిరేటు 6.6 శాతం వేగంతో పెరుగుతోంది. అంతేకాదు, కేసులు రెట్టింపు కావడానికి పట్టిన సమయం కూడా తగ్గతూ ఉండటం ఆందోళన కలిగించే అంశం. మే 2కి ముందు 15 రోజులతో పోల్చితే ప్రస్తుతం 11 రోజులకు పడిపోయింది.

⍟ దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదువుతున్నాయి. రోజు రోజుకూ పాజిటివ్ కేసుల్లో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. బుధవారం సాయంత్రానికి 50వేల మార్క్ దాటగా… గడచిన 24 గంటల్లో 3,600 మంది వైరస్ బారినపడ్డారు. దేశంలో మహమ్మారి మొదలైన తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. దేశవ్యాప్తంగా 3,602 కొత్త కేసులు నమోదు కాగా.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 52,935కి చేరింది.

⍟ తెలంగాణలో కొత్తగా మరో 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1107కు ఎగబాకింది. బుధవారం (మే 6) 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులన్నీ జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉండటం గమనార్హం.

⍟ మహారాష్ట్రలో వ్యాప్తి ఉగ్రరూపం దాల్చింది. బుధవారం (మే 6) ఒక్క రోజే 1,233 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక్క రోజులో నమోదైన అత్యధికం కేసులు ఇవే. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 16,758కి ఎగబాకింది.

⍟ కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉన్నందున హైదరాబాద్ సహా చుట్టుపక్కల రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలను సైతం రెడ్ జోన్‌గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ ప్రాంతాల్లో కరోనాను తగ్గించేందుకు కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

⍟ కేరళకు మరోసారి రిలీఫ్. రాష్ట్రంలో బుధవారం (మే 6) కొత్త కేసులేవీ నమోదు కాలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 30 ఉన్నట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. బుధవారం మరో ఏడుగురు కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

⍟ విశాఖలో భారీ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున నగరంలోని గోపాలపట్నం పరిధి ఆర్‌.ఆర్‌.వెంకటాపురంలో ఉన్న ఎల్‌.జి.పాలిమర్స్‌ పరిశ్రమలో రసాయన వాయువు లీకై 3 కి.మీ మేర వ్యాపించింది. ఈ గ్యాస్ లీక్ కావడం.. అది బాగా ఘాటుగా ఉండటంతో.. చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో స్థానికులు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

⍟ ఏపీలో మద్యం అమ్మకాలు మూడు రోజులుగా కొనసాగుతున్నాయి. మందుబాబులు షాప్‌లో అలా ఓపెన్ చేశారో లేదో.. ఇలా ఎగబడిపోతున్నారు. సాయంత్రం దుకాణాలు మూసివేసే వరకు రద్దీ కొనసాగుతోంది. ప్రభుత్వం భారీగా ధరలు పెంచినా ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఇదిలా ఉంటే మద్యం ప్రియులకు అధికారులు మరో షాక్ ఇచ్చారు.

⍟ ఆంధ్రప్రదేశ్‌లో భారీగా కేసులు నమోదవుతున్న కర్నూలు, గుంటూరు జిల్లాల ప్రభావం పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంపై కూడా పడింది. ఈ రెండు జిల్లాల గురించి ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు (కేసీఆర్) గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ, లాక్ డౌన్ అమలు, సహాయక చర్యలపై తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

⍟ కరోనా వైరస్ (కోవిడ్‌-19) నివారణా చర్యలు, వలస కార్మికులను రాష్ట్రానికి తీసుకురావడంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వలస కూలీలు.. అలాగే రాష్ట్రంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కూలీల తరలింపు విధానాలపై ఈ సందర్భంగా అధికారులతో చర్చించారు.

⍟ కరోనా వైరస్ కోరల్లో చిక్కుకుని ప్రపంచ దేశాలు విలవిలలాడుతున్నాయి. మహమ్మారి దెబ్బకు అగ్రరాజ్యాలు కూడా అల్లాడిపోతున్నాయి. గత కొద్ది రోజులుగా వైరస్ దెబ్బకు చిగురుటాకులా వణుకుతున్న అమెరికాలో మహమ్మారి కాస్త శాంతించిన ఛాయలు కనిపిస్తున్నాయి. వైరస్‌ వ్యాప్తి పూర్తిస్థాయిలో నియంత్రణలోకి రాకపోయినా.. గత వారంతో పోలిస్తే కొత్త కేసులు, మరణాల సంఖ్య తక్కువగా నమోదవుతోంది. అటు ఐరోపా దేశాల్లోనూ పరిస్థితి కుదుటపడుతోంది. ఇటలీ, స్పెయిన్‌లో మరణాలు తగ్గుముఖం పట్టాయి. కొత్తగా వైరస్ సోకతున్నవారి సంఖ్య కూడా తగ్గింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here