కరోనా బారిన పడి అనేకమంది ప్రాణాలు వదులుతున్నారు. తాజాగా ఈ ప్రాణాంతక వైరస్ సోకి సీర్పీఎఫ్ జవాన్ మృతి చెందారు. సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ ఎస్ఐ దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో కరోనా సోకి మరణించారు. ఢిల్లీలోని 31వ సీఆర్ పీఎఫ్ బెటాలియన్ లో మరో 45 మందికి పాజిటివ్ అని పరీక్షల్లో వచ్చింది. దీంతో అధికారులు సీఆర్పీఎఫ్ బెటాలియన్కు సీలు వేశారు. సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో చేరిన 55 ఏళ్ల సీఆర్ పీఎఫ్ ఎస్ఐ కరోనాతో మృతిచెందడం కలకలం రేగింది.
జమ్ము కశ్మీర్ లోని కుప్వారా లోని 162వ బెటాలియన్ లో అసిస్టెంట్ గా పని చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ సెలవుపై నోయిడా వచ్చారు. అయితే లాక్ డౌన్ కారణంగా అతడిని 31వ బెటాలియన్ లో రిపోర్ట్ చేయాలని సూచించారు ఉన్నతాధికారులు. దీంతో ఆయన అక్కడ డ్యూటీలో చేరిన తర్వాత ఏప్రిల్ 21న అతడికి కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో ఆయనకు టెస్టులు చేయగా.. పాజిటివ్ వచ్చింది. దీంతో అతడితో కాంటాక్ట్ అయిన బెటాలియన్ సిబ్బంది పలువురికి టెస్టులు చేయగా దాదాపు 45 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. అందులో ఒకరైన 55 ఏళ్ల ఎస్సై ర్యాంక్ సీఆర్పీఎఫ్ జవాన్ కూడా ఉన్నారు. అస్సాంలోని బర్పేటకు చెందిన ఆయనకు డయాబెటిస్, హైపర్ టెన్షన్ లాంటి సమస్యలు ఉండడంతో కరనా ప్రభావం తీవ్రమైంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో మంగళవారం మరణించినట్లు వైద్య శాఖ అధికారులు తెలిపారు.
మరోవైపు ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్ర సంతాపం తెలిపారు. సీఆర్ పీఎఫ్ బెటాలియన్ లో కరోనా వైరస్ ప్రబలకుండా అన్నిరకాల చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి డైరెక్టర్ జనరల్ ను ఆయన ఆదేశించారు. దీంతో బెటాలియన్ కు సీలు వేశారు. కరోనా బారిని పడిన వారందరినీ క్వారంటైన్ కోసం ఆసుపత్రులకు తరలించారు. 1100 మంది జవాన్లు ఉన్న ఈ బెటాలియన్ లో మరో 257 మందికి కరోనా పరీక్షలు చేశారు. వారి పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది.