ఒక్క రోజులోనే మారిన ఫలితం.. ఆ పైలట్లకు కరోనా నెగెటివ్, కారణం ఇదేనా?

మూడు రోజుల కింద ఐదుగురు ఎయిరిండియా పైలట్లకు పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ముంబయికి చెందిన 77 మంది పైలట్లకు పరీక్షలు నిర్వహించగా ఐదుగురకి పాజిటివ్‌ రావడం కలకలం రేపింది. ఐతే.. తాజాగా, వీరికి నిర్వహించిన పరీక్షలో నెగిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో, టెస్టింగ్ కిట్‌లపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ రాగా.. సోమవారం సాయంత్రం మరోసారి పరీక్షలు నిర్వహించారు. ఈ ఫలితాల్లో నెగెటివ్ వచ్చినట్టు ఎయిరిండియా వర్గాలు వెల్లడించాయి. తమ సంస్థకు చెందిన ఐదుగురు పైలట్లకు రెండోసారి నిర్వహించిన పరీక్షల్లో కరోనా వైరస్ నెగెటివ్ వచ్చినట్టు పేర్కొన్నాయి.

ప్రస్తుతం ఈ ఐదుగురు పైలట్లు ఇటీవల గ్యాంగ్జూకు వెళ్లిన కార్గో విమానం నడిపినట్టు అధికారులు వెల్లడించారు. లాక్‌డౌన్ విధించిన తర్వాత అంతర్జాతీయ గమ్యస్థానాలకు కార్గో విమాలను ఎయిరిండియా నడుపుతోంది. గ్యాంగ్జూ నుంచి ఢిల్లీకి బోయింగ్ 787 విమానాలు ద్వారా ఏప్రిల్ 18న వైద్య సామాగ్రిని తరలించారు. దీంతోపాటు షాంఘై, హాంకాంగ్‌లకు ఎయిరిండియా సర్వీసులు నడిచాయి. అయితే, తమ సిబ్బందికి కరోనా సోకినట్టు ఎయిరిండియా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. స్వదేశానికి భారతీయులను తీసుకొచ్చే విమానాల్లోని సిబ్బందికి బయలుదేరడానికి ముందు, గమ్యస్థానం చేరిన తర్వాత కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. సిబ్బంది నుంచి నమూనాలు సేకరించిన తర్వాత.. ఫలితాలు రావడానికి 24 నుంచి 48 గంటలు పడుతుంది. ఈ సమయంలో వారికి హోటల్‌లో వసతి ఏర్పాటుచేస్తారు. ఒకవేళ నెగెటివ్ వస్తే, విమానం బయలుదేరడానికి అనుమతిస్తారు. వారు స్వదేశానికి వచ్చిన ఐదు రోజుల తర్వాత మరోసారి పరీక్షలు చేపడతారు. ఈ పరీక్షల్లో నెగెటివ్ వస్తే వారిలో ఎలాంటి కరోనా వైరస్ లక్షణాలు లేవని నిర్ధారించుకుంటారు. తర్వాతే విధులకు అనుమతిస్తారు.

ప్రీ-ఫ్లైట్ కోవిడ్ పరీక్ష అవసరం ఏంటంటే, బయలుదేరిన ఐదు రోజులలోపు నమూనాా సేకరించబడి, నెగెటివ్ రావాలి. విదేశాల నుంచి తరలించే భారతీయుల కోసం పంపే విమానాల్లోని తన ఉద్యోగుల రక్షణకు ఎయిరిండియా తగిన చర్యలు తీసుకుంటుంది. హజ్మత్ సూట్స్, గ్లోవ్స్, మాస్క్, గాగుల్స్ సహా పీపీఈ కిట్‌లను అందజేస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here