హైదరాబాద్ నుంచి ఆగ్రాకు వెళ్తోన్న లారీ బోల్తా.. ఐదుగురు మృతి

మధ్యప్రదేశ్‌లో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నర్సింగ్‌పూర్ జిల్లా పథా గ్రామం వద్ద మామిడికాయలతో వెళ్తున్న లారీ బోల్తాపడింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 11 మంది గాయపడ్డారు. ప్రమాదానికి గురయిన వాహనం హైదరాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు మామిడికాయలతో వెళ్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ వాహనంలో 18 మంది ఉన్నారని నర్సింగ్‌పూర్ జిల్లా కలెక్టర్ దీపక్ సక్సేనా తెలిపారు. అతివేగంగా వెళ్తున్న వాహనం పథా గ్రామం వద్ద శనివారం అర్ధరాత్రి సమయంలో అదుపుతప్పి బోల్తాపడిందని పేర్కొన్నారు.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వాహనం కింద చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీసి చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. గాయపడినవారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని, ప్రస్తుతం వీరికి చికిత్స కొనసాగుతుందని పేర్కొన్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

లారీలో ఇద్దరు డ్రైవర్లు, ఓ క్లీనర్ సహా 18 మంది లేబర్ ఉన్నారు. గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో జబల్‌పూర్ హాస్పిటల్‌కు తరలించినట్టు అధికారులు వెల్లడించారు. ఈ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మిగతావారికి గాయాలు చిన్నవేనని పేర్కొన్నారు. వీరిలో ఒకరు మూడు రోజులుగా జ్వరం, జలుబు బాధపడుతున్నారని, దీంతో అందరి రక్త నమూనాలను సేకరించి పరీక్షలకు పంపినట్టు వైద్యులు వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here