వలస కూలీల రైళ్లలో ఇదే అదనుగా ఇతరులు.. చెక్ పెట్టిన కేంద్రం

లా క్‌డౌన్‌తో పడుతున్న బాధలకు చలించి కేంద్ర ప్రభుత్వం వారి తరలింపునకు ప్రత్యేక ఏర్పాట్లు చేయగా.. ఇదే అదనుగా కొంత మంది స్వస్థలాలకు వెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు కేంద్రం దృష్టికి రావడంతో ఆదివారం (మే 3) మరిన్ని నిబంధనలు విధిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. సాధారణ ప్రజలు, ఇతరులు స్వస్థలాలకు వెళ్లకుండా చూడాల్సిందిగా రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖ రాశారు. వలస కూలీలు, విద్యార్థుల తరలింపునకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించారు.

వలస కార్మికులను స్వస్థలాలకు చేరవేసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘శ్రామిక్’ రైళ్లు నడపుతోంది. అయితే.. ఈ రైళ్లలో ప్రయాణించేందుకు లక్షలాది మంది కూలీలు దరఖాస్తు చేసుకున్నారు. కూలీలతో పాటు ఇదే అదనుగా సాధారణ ప్రజలు కూడా స్వస్థలాలకు పయనమవుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది.

లాక్‌డౌన్‌కు ముందు ఉపాధి కోసం, ఉద్యోగ నిర్వహణలో భాగంగా ఇతర ప్రాంతాలకు వెళ్లి లాక్‌డౌన్‌ ఆంక్షల కారణంగా అక్కడ చిక్కుకుపోయిన వలస కార్మికులు, ఉద్యోగులకు మాత్రమే ఇతర రాష్ట్రాల్లోని తమ స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఆయా ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తూ అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వారు స్వస్థలాలకు వెళ్లడానికి వీల్లేదని పేర్కొంది.

మరోవైపు.. స్వస్థలాలకు పంపించాలంటూ లక్షలాదిగా దరఖాస్తులు వస్తుండటంతో అధికారులు తలలు పట్టుకున్నారు. డిజిటల్ పాసులు జారీ చేయడానికి ఏర్పాటు చేసిన వెబ్‌సైట్లకు తాకిడి పెరగడంతో సేవలు నిలిచిపోయాయి. అంతేకాకుండా అసలు వలస కార్మికులు ఎవరో, సాధారణ ప్రజలు ఎవరో గుర్తించడం అధికారులకు తలకు మించిన భారం అవుతోంది. మొత్తంగా ఈ ప్రక్రియ గందరగోళంగా మారింది.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here