వందే భారత్ మిషన్: స్వదేశానికి భారతీయలు.. తొలి ల్యాండింగ్ కేరళలో

మహమ్మారిని కట్టడిచేయడానికి విధించిన లాక్‌డౌన్‌ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేందుకు కేంద్రం ‘’ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ మిషన్‌లో భాగంగా తొలి విడత రెండు విమానాలలో 363 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. అబుదాబి నుంచి వచ్చిన ఎయిరిండియా ప్రత్యేక విమానం కేరళలోని కొచ్చిలో గురువారం రాత్రి ల్యాండ్ అయింది. వీరిలో 49 మంది గర్భిణులు, నలుగురు చిన్నారులు ఉన్నారు. అలాగే దుబాయ్ నుంచి కోజికోడ్‌కు గురువారం రాత్రి 10.30 గంటలకు మరో విమానంలో 177 మంది భారతీయులు చేరుకోగా.. వీరిలో ఐదుగురు చిన్నారులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీరందరూ తమ సొంత ఖర్చులతో 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలి.

గురువారం ఉదయం ఎయిరిండియాకు చెందిన 189 సీటింగ్ సామర్థ్యం గల బోయింగ్ 737 విమానాలు రెండు దుబాయ్‌కి గురువారం ఉదయం బయలుదేరి వెళ్లాయి. ఒక్కో విమానంలో ఇద్దరు పైలట్లు, నలుగురు క్యాబిన్ క్రూ సిబ్బందితో ఈ విమానాలు అక్కడకు చేరాయి. ప్రయాణికుల్లో ఎవరికైనా కోవిడ్-19 లక్షణాలు ఉంటే అలాంటి వారికి వెనుక భాగంలో సీట్లను వదలిపెట్టారు.

విమానం తలుపులు తెరవడానికి ముందే క్యాబిన్ క్రూ సిబ్బంది ప్రొటెక్టివ్ గౌన్‌లు, మాస్క్‌లు ధరించాలని సూచనలు జారీచేశారు. అలాగే ప్రయాణికులు మాస్క్‌లు, గ్లోవ్స్ తప్పకుండా ధరించాలని ఆదేశించారు. విమానం ఎక్కిన తర్వాత ప్రయాణికులకు రెండు మాస్క్‌లు, 100 ఎం.ఎల్ శానిటైజర్ బాటిల్ అందజేశారు. దీంతో పాటు ఆహారం, వాటర్ బాటిల్ ఉచితంగా అందజేసినట్టు అధికారులు తెలిపారు.

తిరువనంతపురం నుంచి బహ్రెయిన్‌కు మే 8, 11న వందే భారత్ విమానం నడుపుతున్నారు. భారత్ నుంచి వెళ్లే ఈ విమానంలో బ్రహెయిన్ పౌరులకు మాత్రమే అనుమతిస్తామని ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. అటు సముద్ర సేతు ఆపరేషన్‌లో భాగంగా మాల్దీవుల రాజధాని మాలీ చేరుకున్న తొలి నౌక తిరిగి పయనమైంది. ఇండియన్ నేవీకి చెందిన ‘ఐఎన్‌ఎస్‌ జలాశ్వ’ యుద్ధనౌక 1,000 మంది ప్రయాణికులను తీసుకొని శుక్రవారం సాయంత్రానికి కోచి తీరం చేరుకోనుంది. భారత్ ‘ఐఎన్‌ఎస్‌ మగర్‌’ అనే మరో యుద్ధనౌకను కూడా మాలీకి పంపించింది.

గల్ఫ్ దేశాల్లో ఎక్కువ మంది భారతీయులు చిక్కుకోవడం, అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతానికే ప్రాధాన్యం ఇస్తోంది. వందే భారత్ ఆపరేషన్‌లో గల్ఫ్‌ ప్రాంతం నుంచే ఎక్కువ మంది భారతీయులు తిరిగివచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం ఇప్పటికే 3 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. తొలివారంలో 23 విమానాలను నడిపి.. అబుదాబీ, దుబాయ్, బహ్రెయిన్, కువైలట్, షార్జా, దోహా, మస్కట్, కౌలలంపూర్, సింగ్‌పూర్, అమెరికా, బ్రిటన్‌లోని 14,800 భారతీయులను స్వదేశానికి తీసుకొస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here