రెడ్ జోన్‌లోనే మెట్రో సహా ప్రధాన నగరాలు.. లాక్‌డౌన్ పొడిగింపునకే మొగ్గు?

కట్టడికి విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్ మరో రెండు రోజుల్లో ముగియనుండగా.. కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ నెలకుంది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్‌ల వివరాల గురించి వెల్లడించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకూ కేంద్ర హోం శాఖ కార్యదర్శి ప్రీతి సూదన్ లేఖ రాశారు. దేశంలో రెడ్ జోన్‌ల సంఖ్య తగ్గినట్టు తెలిపింది.

దీన్ని బట్టి రెడ్‌ జోన్లలో లాక్‌డౌన్‌ కొనసాగించేందుకే ప్రధాని మొగ్గు చూపుతారన్న ప్రచారం జరుగుతోంది. తాజా గణాంకాల ప్రకారం.. దేశ వ్యాప్తంగా 130 జిల్లాలు రెడ్‌ జోన్‌లో, 284 జిల్లాలు ఆరెంజ్‌ జోన్‌లో, 319 జిల్లాలు గ్రీన్‌ జోన్‌లో ఉన్నాయని కేంద్ర హోంశాఖ ప్రకటన విడుదల చేసింది. కరోనా వైరస్‌ తీవ్రతను బట్టి తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి ప్రీతీ సూదన్ లేఖ రాశారు.

ఇదిలా ఉండగా దేశంలోని ఆరు ప్రధాన నగరాలు రెడ్ జోన్‌లోనే ఉన్నట్టు తెలిపింది. ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్ నగరాలను కరోనా హాట్‌స్పాట్‌లుగా ఉన్నట్టు పేర్కొంది. దేశంలోనే అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 19 జిల్లాలు రెడ్ జోన్‌లో ఉన్నాయి. తర్వాతి మహారాష్ట్ర (14), తమిళనాడు (12), ఢిల్లీ (11), పశ్చిమ్ బెంగాల్ (10), మధ్యప్రదేశ్ (9), రాజస్థాన్ (8), తెలంగాణ (6), ఆంధ్రప్రదేశ్ (5), బీహార్ (5) ఉన్నాయి.

తెలంగాణలోని ఆరు జిల్లాలను రెడ్ జోన్లుగా ప్రకటించిన కేంద్రం.. 18 జిల్లాలను ఆరెంజ్ జోన్లుగా, 9 జిల్లాలను గ్రీన్ జోన్లుగా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరులు రెడ్ జోన్‌లో ఉన్నాయి.. ఇక ఆరెంజ్‌ జోన్‌ జిల్లాలుగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కడప, అనంతపురం, శ్రీకాకుళం, ప్రకాశం, విశాఖలు ఉన్నాయి. గ్రీన్‌జోన్‌గా విజయనగరం జిల్లా మాత్రమే ఉంది.

ఇదిలా ఉండగా.. మంత్రులు, అధికారులతో భేటీ అనంతరం లాక్‌డౌన్‌పై ప్రధాని నరేంద్ర మోదీ నేడు లేదా రేపు ప్రకటన చేసే అవకాశముంది. 3వ తేదీతో లాక్‌డౌన్‌ గడువు ముగియనుండటంతో లాక్‌డౌన్‌ కొనసాగిస్తారా? ఎత్తివేస్తారా? అనేదానిపై దేశ ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రధాని ప్రకటన తర్వాతే లాక్‌ డౌన్‌ ఉత్కంఠకు తెరపడనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here