క రోనా వైరస్ను తరిమి కొట్టడానికి మద్యం షాపులను తెరిపించాలని కోరారు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే. అవును మీరు చదివింది కరెక్టే. ఇంతకీ.. లిక్కర్కు కరోనా నియంత్రణకు సంబంధం ఏంటి అంటారా..? అందుకు ఆ నేత చెప్పిన కారణం కూడా ఆసక్తికరంగానే ఉంది. ఆల్కహాల్తో తయారు చేసిన శానిటైజర్లకు కరోనా వైరస్ను నియంత్రించే శక్తి ఉన్నప్పుడు.. ఆల్కహాల్ తాగితే గొంతులోని కరోనా వైరస్ నశిస్తుందిగా అని వివరిస్తున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి లేఖ రాశారు. రాజస్థాన్ కాంగ్రెస్ సీనియర్ నేత, సంగోడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే భరత్ సింగ్ కుందన్పుర్ ఆ రాష్ట్రంలో వెంటనే మద్యం దుకాణాలు తెరవాలని కోరుతూ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్కు రాసిన లేఖ దేశంలో హాట్ టాపిక్గా మారింది.
‘ఆల్కహాల్ను రుద్దినంత మాత్రాన చేతులకున్న కరోనా వైరస్ చచ్చిపోతుందంటే.. ఆల్కహాల్ తాగితే గొంతులోని వైరస్ కచ్చితంగా చచ్చిపోతుంది’ అని భరత్ సింగ్ తన లేఖలో పేర్కొన్నారు. ‘లాక్డౌన్తో లిక్కర్ షాపులు మూతబడ్డాయి. వాటిని ఇప్పట్లో తెరిపించే ఆలోచన కేంద్రానికి లేనట్లుంది. మరోవైపు అక్రమ మద్యం తయారీ పెరుగుతోంది. అక్రమ మద్యం విక్రయాలు కూడా ఊపందుకున్నాయి. మద్యం షాపుల మూసేయడం ఇతర అనర్థాలకు కారణమవడమే కాకుండా, ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపనుంది’ అని భరత్ సింగ్ తన లేఖలో పేర్కొన్నారు.
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటించిన ప్రధాని మోదీ.. అంటువ్యాధుల చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఇందులో భాగంగా నిత్యావసరాల షాపులు మినహా మరే దుకాణాలు తెరవొద్దని ఆదేశించారు. ఆ వెంటనే దేశవ్యాప్తంగా మద్యం అమ్మకాలు నిలిచిపోయాయి. దీంతో అటు నకిలీ మద్యం తయారీ ఊపందుకోగా.. మద్యానికి బానిసైన వారు వింతగా ప్రవర్తిస్తూ ఆస్పత్రుల పాలవుతున్నారు.
Also Read: