భారత్, చైనా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత.. యుద్ధ విమానాల మోహరింపు

భా రత్‌, చైనా సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తతలు చెలరేగాయి. చైనాకు చెందిన సైనిక విమానాలు భారత భూభాగానికి అతి సమీపంగా ఎగిరాయి. మంగళవారం (మే 12) ఉదయం చైనాకు చెందిన మిలిటరీ విమానాలు ఇండియా-సినో సరిహద్దు వద్ద నిషిద్ధ గగనతలంలో పలుమార్లు చక్కర్లు కొట్టాయని భారత వర్గాలు తెలిపాయి. ఆ వెంటనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన సుఖోయ్-30 యుద్ధ విమానాలు అక్కడికి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఫలితంగా మరోసారి అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.

ఇటీవల ఇరు దేశాల సైనికులు తీవ్ర స్థాయిలో ఘర్షణ పడిన లద్దాక్ తూర్పు భాగంలో తాజా ఘటన చోటు చేసుకుంది. మే 5వ తేదీ రాత్రి లద్దాక్‌లోని పాంగాంగ్‌ సరస్సు వద్ద ఇరు దేశాల సైనికులు బాహాబాహీకి దిగారు. సుమారు 250 మంది సైనికులు పరస్పరం తలపడి పిడిగుద్దులు కురిపించుకున్నారు. రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో ఇరు దేశాలకు చెందిన 10 సైనికులు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. నాటి నుంచి అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చైనా సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది.

ఘర్షణ ముదరడంతో ఇరు పక్షాలూ అక్కడికి అదనపు బలగాలను తరలించాయి. మే 6న ఉదయం ఇరు దేశాలకు చెందిన స్థానిక సైనికాధికారులు సమావేశమై ఈ అంశంపై చర్చించారు. అనంతరం ఘర్షణ సద్దుమణిగిందని వెల్లడించారు. అయితే, గత శనివారం సిక్కిం సెక్టార్‌లోని ‘నాకు లా పాస్‌’ వద్ద ఇరు దేశాల సైన్యం మధ్య మరోసారి ఘర్షణ చోటు చేసుకుంది. ఇక్కడ భారత్, చైనాకు చెందిన సుమారు 150 మంది సైనికులు పరస్పరం పిడిగుద్దులు కురిపించుకున్నారు. తాజాగా లద్ధాక్‌లో మరోసారి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here