పేదరికానికే కరోనా కాటు.. అంచనా తలకిందులు

ప్ర పంచంలోని చాలా దేశాలతో పోలిస్తే భారత్‌లో కరోనా కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నాయి. అమెరికా, బ్రిటన్‌ లాంటి అగ్ర రాజ్యాల్లో మాదిరిగా మన దేశంలో కరోనా వైరస్‌ వేగంగా విస్తరించడం లేదు. అయితే.. పలు దేశాల్లో వ్యాప్తికి సంబంధించిన కారణాలను విశ్లేషిస్తే కొన్ని సారూప్యతలు కనిపించాయి. తాజాగా తేలిన విషయం ఏమిటంటే.. ఈ మహమ్మారి ప్రత్యక్షంగా, పరోక్షంగా పేదవాళ్లకే ఎక్కువ చేటు చేస్తోంది.

కరోనా వైరస్ వ్యాప్తి చెందిన తొలి రోజుల్లో సంపన్న వర్గాల్లోనే ఎక్కువగా దీని బారినపడ్డారు. దీన్ని ధనికుల వ్యాధిగా సోషల్ మీడియాలో కొంత మంది ప్రచారం చేశారు. కానీ, రెండు నెలలు తిరిగే సరికి పరిస్థితి తలకిందులైంది. ఇరుకైన కాలనీల్లో, మురికివాడల్లో ఈ వైరస్ ఎక్కువగా వ్యాపిస్తోంది. చిరు వ్యాపారులపై పంజా విసురుతోంది.

అమెరికాలో కరోనా మరణాలు ఎందుకు ఎక్కువగా నమోదవుతున్నాయని సర్వే చేయగా.. కీలక విషయాలు వెల్లడయ్యాయి. యూఎస్‌లో జనసాంద్రత ఎక్కువగా ఉన్న న్యూయార్క్, న్యూజెర్సీ ప్రాంతాల్లోనే కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి. న్యూయార్క్‌ నగరంలోనూ మన్‌హట్టన్‌ లాంటి ప్రాంతాల కంటే బ్రాంక్స్, క్వీన్స్, బ్రూక్లిన్‌ ప్రాంతాల్లో కేసులు ఎక్కువగా ఉన్నాయి.

Also Read:

మన్‌హట్టన్‌లో ధనికవర్గాలు, శ్వేతజాతీయులు ఎక్కువగా నివసిన్నారు. మిగతా ప్రాంతాల్లో నల్ల జాతీయులు ఎక్కువగా ఉన్నారు. స్థూలంగా చెప్పాలంటే న్యూయార్క్‌లో తెల్లజాతీయుల కంటే నల్ల జాతీయులే ఎక్కువగా కరోనా వైరస్‌ బారిన పడుతున్నారు. తెల్లజాతీయులు ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉండడం, పెద్ద పెద్ద ఇళ్లలో దూరంగా ఉండటం వల్ల వారు ఎక్కువగా కరోన బారిన పడటం లేదు. నల్లజాతీయులు ఆర్థికంగా వెనకబడిపోయి ఉండటం, కిక్కిరిసిపోయిన ప్రాంతాల్లో నివాసం ఉండటం వల్ల వారిలో వైరస్‌ వేగంగా వ్యాపిస్తోంది. బ్రాంక్స్‌లో 43 శాతం మంది ఆఫ్రికన్‌ అమెరికన్లు నివసిస్తున్నట్లు అంచనా. ఇంగ్లండ్‌లోనూ వెనకబడిన ప్రాంతాల్లోనే కరోనా వైరస్‌ ఎక్కువగా విస్తరిస్తోంది.

భారత్‌లోనూ ఇదే తీరు..

భారత్‌లోని పలు నగరాల్లోనూ కరోనా వైరస్ వ్యాపిస్తున్న తీరు గమనిస్తే ఇదే అంశం తేటతెల్లం అవుతోంది. ముంబై నగరంలో కరోన వైరస్ విజృంభజ తీవ్ర స్థాయిలో ఉన్న విషయం తెలిసిందే. ఇందుక్కారణం ఇక్కడ మురికివాడలు, కిక్కిరిసిన నివాస సముదాయాలు ఎక్కువగా ఉండటమేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆసియాలోనే అత్యంత మురికివాడగా పేరున్న ధారావి ప్రాంతంలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. అక్కడ రేకుల గదుల్లో పేదవారు ఎక్కువగా నివసిస్తున్నారు.

హైదరాబాద్ నగరంలోనూ పాతబస్తీ, జియాగూడ తదితర ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాలు కూడా పేదవారు ఎక్కువగా నివసిస్తున్నవే కావడం గమనార్హం. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోనూ ఇదే తరహాలో వైరస్ వ్యాపిస్తోంది. పేదవారు ఎక్కువగా నివాసం ఉంటున్న ప్రాంతాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. చెన్నైలోనూ ఇలాంటి ప్రాంతాల్లోనూ కరోనా కేసులు నమోదవుతున్నాయి.

Also Read:

కూరగాయల మార్కెట్లు, చేపల విక్రయ కేంద్రాలు తదితరాలు కూడా కరోనా వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నాయి. ఇప్పుడు వలస కార్మికుల రాకపోకలను అనుమతించడం వల్ల కేసులు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. కరోనా వైరస్ పేద, మధ్య తరగతి వర్గాల వారికే ఎక్కువగా సోకుతుండగా.. పరోక్షంగానూ ఈ వర్గాలపైనే ప్రభావం చూపుతోంది. కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌తో కూలీలు, చిరు వ్యాపారులు కుదేలయ్యారు. వారి కుటుంబాలపై ఆర్థికంగా తీవ్ర ప్రభావం పడుతోంది. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే మధ్య తరగతి వారు తీవ్రంగా నష్టపోతున్నారు. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 49 మిలియన్ల మందిని పేదరికంలోకి నెట్టేసిందనేది చేదు వాస్తవం.

Must Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here