దేశంలో భారీగా పెరిగిన కరోనా కేేసులు.. ఒక్క రోజులో అత్యధికం

దేశంలో కరోనా కేసుల సంఖ్య 23,452కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. శుక్రవారం ఒక్క రోజే 1752 కొత్త కేసులను గుర్తించారు. భారత్‌లో ఇప్పటి వరకూ ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే కావడం గమనార్హం. ప్రస్తుతం దేశంలో 17,915 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడచిన 24 గంటల్లో కరోనా కారణంగా 37 మంది చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య 723కి చేరింది. భారత్‌లో కరోనా పేషెంట్ల రికవరీ శాతం 20.57గా ఉంది.

కరోనా కేసులు రెట్టింపు కావడానికి ఈ వారం ఆరంభంలో 7.5 రోజులు పట్టగా.. ప్రస్తుతం కోవిడ్ కేసులు రెట్టింపు కావడానికి 10 రోజుల సమయం పడుతోందని కేంద్రం తెలిపింది. గత 14 రోజుల్లో 80 జిల్లాల్లో కొత్త కేసులు నమోదు కాలేదని వెల్లడించింది.

లాక్‌డౌన్ విధించాక.. ప్రజలు, అధికార యంత్రాంగం సమష్టి కృషితో కరోనా వ్యాప్తిని అడ్డుకోగలిగామని కేంద్రం తెలిపింది. గ్రీన్ జోన్ జిల్లాల్లో కొత్త కేసులు నమోదు కాకుండా చూడటం, ఈ జాబితాలోకి మరిన్ని జిల్లాలను చేర్చాల్సిన బాధ్యత మన మీద ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.

దేశంలో ఎక్కువ కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర (6430), గుజరాత్ (2624), ఢిల్లీ (2376) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here