దేశంలో కరోనా కేసులు: జోరు ఇలాగే సాగితే మే నెలాఖరుకి 2 లక్షలకు!

దేశంలో కట్టడికి లాక్‌డౌన్ కొనసాగుతున్నా పాజిటివ్ కేసులకు మాత్రం కళ్లెం పడడం లేదు. ఆదివారం నాటికి దాదాపు 63,000కి చేరువయ్యాయి. మే 13 నాటికి దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 60వేలకు చేరుతుందని ఐఐటీ- ఢిల్లీ పరిశోధన బృందం అంచనా వేయగా, నాలుగు రోజుల ముందే దానికి చేరువవ్వడం గమనార్హం. ఏప్రిల్ 28 నాటికి 30వేలుగా ఉన్న పాజిటివ్ కేసులు.. కేవలం 11 రోజుల్లోనే రెట్టింపు అయ్యాయి. ఇదే ఒరవడి కొనసాగితే నెలాఖరుకల్లా రెండు లక్షలకు చేరే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇప్పటి వరకూ 62,913 మందికి వైరస్ నిర్ధారణ కాగా.. వీరిలో 2,103 మంది మృతిచెందారు. మరో 19,315 మంది కోలుకోగా… 41,495 మంది చికిత్స పొందుతున్నారు.

కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం.. శనివారం సాయంత్రానికి మొత్తం కరోనా కేసులు 59,662కి, మరణాల సంఖ్య 1,981కి చేరాయి. రోగుల్లో 29.91% మంది కోలుకోగా, 3.32% మంది మరణించారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కలిపి నిర్వహించిన పరీక్షల సంఖ్య 15,23,213కి చేరింది. గతంలో ఎన్నడూ లేనంత రోజుకు 95,000 మందికి పరీక్షలు నిర్వహించగలిగే స్థాయికి చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు.

శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 11 రాష్ట్రాల్లో 125 మరణాలు సంభవించగా, మహారాష్ట్ర, గుజరాత్‌లలోనే అందులో 64% చోటు చేసుకున్నాయి. అహ్మదాబాద్‌లో పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియాను కేంద్రం పంపింది. అహ్మదాబాద్‌లోని ప్రభుత్వాసుపత్రిని శనివారం సందర్శించిన ఆయన వైద్య సిబ్బందికి సూచనలు చేశారు.

విదేశాల నుంచి కేరళకు వచ్చిన ఇద్దరికి కరోనా సోకినట్లు శనివారం వెల్లడైంది. వీరితో కేరళలో కొవిడ్‌ కేసుల సంఖ్య 517కి చేరింది. మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 20 వేలు దాటింది. శనివారం 1165 కొత్త కేసులు నమోదు కాగా.. మరో 48 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ రాష్ట్రంలో కోవిడ్ బాధితుల సంఖ్య 20,228కి చేరింది. ఒక్క ముంబైలోనే 12,864 కరోనా కేసులు నమోదు కాగా.. 489 మంది చనిపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here