చైనాకు ఒక్క అడుగు దూరంలో.. 75వేలు దాటిన కరోనా కేసులు

దేశంలో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడచిన రెండు వారాలుగా పాజిటివ్ కేసుల రోజుకు సగటు 3,000పైగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 75వేలు దాటింది. గడచిన మూడు రోజులతో పోల్చితే మంగళవారం పాజిటివ్ కేసులు తక్కువ నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో మరో 121 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,415కు చేరింది. అటు, పాజిటివ్ కేసుల్లో చైనా తర్వాతి స్థానానికి భారత్ చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక పాజిటివ్ కేసులు నమోదయిన దేశాల జాబితాలో చైనా 11వ స్థానంలో ఉండగా.. భారత్ దీని తర్వాతి స్థానంలో ఉంది.

చైనాలో కేసుల సంఖ్య 82,900 దాటగా, రాష్ట్ర ప్రభుత్వాలు వెల్లడించిన లెక్కల ప్రకారం బుధవారం ఉదయానికి భారత్‌లో కేసులు 75,000కి చేరాయి. ఇప్పటి వరకు మొత్తం 24,420 మంది కోలుకున్నారు. మంగళవారం రాత్రి వరకు కొత్తగా 3,543 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం నాటికి బాధితుల రికవరీ రేటు 31.73%కి, మరణాల రేటు 3.24%కి చేరింది. నెల రోజుల కిందట మరణాల రేటు 3.23 శాతంతో పోలిస్తే ప్రస్తుతం దాదాపు ఒకేలా ఉంది. రికవరీ రేటు మాత్రం 30 రోజుల్లో 9.05% నుంచి 31.73%కి చేరింది.

అత్యధికంగా కరోనా మరణాలు మహారాష్ట్ర, గుజరాత్‌ల్లోనే చోటుచేసుకున్నాయి. దేశంలో తొలికేసు నమోదైన నాటి నుంచి 28వేలకు చేరుకోవడానికి 83 రోజులుపట్టగా, గడచిన 10 రోజుల్లోనే దీనికి రెట్టింపు కేసులు నమోదయ్యాయి. చైనాలో మరణాల రేటు 5.58 శాతం ఉండగా, భారత్‌లో అది 3.24%కి పరిమితం కావడం కొంత ఊరటనిచ్చే అంశం. అయితే అక్కడ రికవరీ రేటు మనకన్నా దాదాపు మూడు రెట్లు (94.27%) అధికంగా ఉంది.

దేశంలో , మరణాల్లో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,000కిపైగా పాజిటివ్ కేసులు నమోదుకాగా.. మొత్తం బాధితుల సంఖ్య 24,427కి చేరింది. పుణె జిల్లాలో కొవిడ్‌-19 కేసుల సంఖ్య మూడు వేల మార్క్‌ని దాటింది. ఒక్క రోజు వ్యవధిలో ఆ జిల్లాలో 136 మంది వైరస్‌ బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,105కు చేరింది. వీటిలో ఒక్క పుణె మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే సుమారు 2,700 కేసులు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 161 మంది ప్రజలు కరోనా కాటుకు బలయ్యారు.

ముంబయిలోని మురికివాడ ధారవిలో కరోనా కేసుల సంఖ్య వెయ్యికి చేరింది. గత 24 గంటల వ్యవధిలో అక్కడ 59 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,000 దాటింది. గడచిన ఆరు రోజుల్లో మహారాష్ట్ర వ్యాపత్ంగా 8,902 కేసులు నమోదుకాగా.. ఒక్క ముంబై నగరంలోనే 5,000 నిర్ధారణ అయ్యాయి. మంగళవారం మరో 426 కేసులు నమోదయ్యాయి. దీంతో ముంబయిలో మొత్తం కేసుల సంఖ్య 14,521కి చేరింది.

తమిళనాడులోనూ గడచిన 24 గంటల్లో కొత్తగా 716 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. ఒక్క చెన్నైలోనే 500 కేసులు రాగా.. తమిళనాడులో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,718కి చేరింది. మరో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. తెలుగు రాష్ట్రాల్లోనూ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఏపీలో 38 కేసులు నమోదు కాగా.. తెలంగాణలో 51 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here