పచ్చటి సంసారాన్ని రోడ్డుప్రమాదం బలి తీసుకుంది. గంటల వ్యవధిలోనే భార్యభర్తలు ప్రాణాలు కోల్పోవడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. ఈ ఘటన జిల్లా వజ్రకరూర్ మండలంలో తీవ్ర విషాదం నింపింది. వజ్రకరూరు మండలం బోడిసానిపల్లి తండాకు చెందిన మూడ్ కేశవ నాయక్(30)కు ఇదే మండలం ఎన్ఎన్పి తండాకు చెందిన వరలక్ష్మిబాయి(26)తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు యువరాజ్(3), కుమార్తె నందిని(1) ఉన్నారు. వరలక్ష్మి ప్రస్తుతం మూడు నెలల గర్భిణి.
Also Read:
కేశవ నాయక్ అక్క ధనలక్ష్మి కర్ణాటకలోని బళ్లారిలో ఉంటుంది. ఆమెకు ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో కేశవ నాలుగు రోజుల క్రితం భార్య, పిల్లలతో కలిసి వెళ్లాడు. ఆదివారం సాయంత్రం తిరిగి బైక్పై ఇంటికి వస్తుండగా పాల్తూరు క్రాస్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో వరలక్ష్మి అక్కడికక్కడే మృతిచెందింది.
Also Read:
తీవ్రంగా గాయపడిన కేశవనాయక్, యువరాజ్, నందినిలను స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా మారడంతో కేశవ అదే రోజు సాయంత్రం ప్రాణాలు కోల్పోయాడు. యువరాజ్, నందినికి ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పారు. ఈ ఘటనపై ఉరవకొండ ఎస్ఐ ధరణిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒకేరోజు తల్లిదండ్రులను పోగొట్టుకుని అనాథలుగా మారిన పిల్లలను చూసి బంధువులు, స్థానికులు కన్నీరు పెడుతున్నారు.
Also Read: