కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్: అల్‌ఖైదా చీఫ్ సహా మరో ఇద్దరు ఉగ్రవాదులు హతం

కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఎరివేత చర్యను సైన్యం మరింత ముమ్మరం చేసింది. సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి పెద్ద సంఖ్యలో ముష్కరులు చొరబాటుకు సిద్ధంగా ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో ఆర్మీ అప్రమత్తమయ్యింది. ఇందులో భాగంగా ఉగ్రకదలికలపై నిఘా పెంచి, ముష్కరుల ఏరివేతకు ఆపరేషన్లు చేపట్టింది. తాజాగా, దక్షిణ కశ్మీర్‌లోని సోఫియాన్‌ జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో కశ్మీర్ మాడ్యూల్ అల్‌ఖైదా చీఫ్ సహా ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఎదురు కాల్పుల్లో ఆర్మీ మేజర్ సహా ఆరుగురు సైనికులు, మరో ఇద్దరు పౌరులు గాయపడినట్టు అధికారులు వెల్లడించారు.

గతేడాది అక్టోబరులో కశ్మీర్ మాడ్యూల్ అల్‌ఖైదా చీఫ్ హమీద్ లోనేను శ్రీనగర్ సమీపంలో జరిగిన ఎదురుకాల్పుల్లో సైన్యం మట్టుబెట్టింది. అతడి స్థానంలో అన్సార్ ఘాజావత్ ఉల్ హింద్ చీఫ్‌గా బుర్హాన్ మాజీద్ కోకా బాధ్యతలు చేపట్టాడు. తాజా ఎన్‌కౌంటర్‌లో సైన్యం కోకాను హతమార్చింది. సోఫియాన్‌లోని జైన్‌పొర ప్రాంతం మెల్‌హూరా గ్రామంలో ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నట్టు నిఘా వర్గాల సమాచారంతో మంగళవారం రాత్రి ఈ ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్‌ను జమ్మూ కశ్మీర్ పోలీసులు, ఇండియన్ ఆర్మీ 55 రాష్ట్రీయ రైఫిల్స్‌ సంయుక్తంగా చేపట్టాయి.

ఉగ్రవాదుల కోసం నిర్బంధ తనిఖీలు చేపట్టగా.. ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన సైన్యం ఎదురు కాల్పులు జరిపింది. ఆపరేషన్ ప్రారంభమైన వెంటనే ఓ ఉగ్రవాది హతమయ్యాడని, మిగతా ఇద్దరు, సైన్యం మధ్య దాదాపు 24 గంటల పాటు హోరాహోరీగా కాల్పులు జరిగినట్టు అధికారులు తెలిపారు. బుధవారం సాయంత్రం తర్వాత అటువైపు నుంచి కాల్పులు ఆగిపోవడంతో ఉగ్రవాదులు హతమైనట్టు నిర్ధారించుకున్నామని తెలిపారు. ఘటనా స్థలిలో ముగ్గురు ఉగ్రవాదుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని, వీరిని మాజీద్ కోకా, అనంత్‌నాగ్‌కు చెందిన నసీర్ భట్, కుల్గామ్‌కు చెందిన ఉమర్ ఫియాదీన్‌గా గుర్తించినట్టు పేర్కొన్నారు.

గాయపడిన ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. వీరికి శ్రీనగర్‌లోని మిలటరీ హాస్పిటల్‌‌లో చికిత్స కొనసాగుతుందని తెలిపారు. కాల్పుల్లో గాయపడిన పౌరులను మెల్‌హూరాకు చెందినవారిగా గుర్తించారు. ఏడాది వ్యవధిలో అల్‌ఖైదా కశ్మీర్ మాడ్యూల్‌ చీఫ్‌లు ముగ్గుర్ని సైన్యం మట్టుబెట్టింది. కశ్మీర్ మాడ్యూల్ వ్యవస్థాపకుడు జకీర్ రషీద్ భట్ అలియాన్ జకీర్ మూసాను గతేడాది మే నెలలో, లోనేను అక్టోబరులో, తాజాగా కోకాను హతమార్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here