కరోనాపై చైనా ఎందుకీ మౌనం.. ఆ ప్రశ్నలకు జవాబు ఏది: న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం

ఈ ఏడాది ప్రారంభంలో మొదలైన విజృంభణతో ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకే కరువయ్యింది. ఈ మహమ్మారి తొలిసారిగా చైనాలోని హుబే ప్రావిన్సుల్లో వుహాన్‌ నగరంలో వెలుగుచూసిన విషయం తెలిసిందే. అక్కడి సముద్ర ఉత్పత్తుల మార్కెట్‌‌లో మొదలైన కొత్తరకం ప్రాణాంతక వైరస్.. క్రమంగా అన్ని దేశాలకు విస్తరించింది. అయితే, వైరస్ జంతువుల నుంచి వ్యాపించలేదని వుహాన్ ల్యాబ్‌లోనే దీనిని జన్యుపరంగా తయారుచేశారనే వాదన కూడా బలంగా ఉంది. తొలి నుంచి వైరస్ విషయంలో చైనా గుంబనంగా వ్యవహరించిందని, ప్రపంచాన్ని తప్పుదారిపట్టించిందని అమెరికా సహా పలు దేశాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి.

మరోవైపు, కరోనా వైరస్ కేసులు, మృతుల వివరాలపై డ్రాగన్ తప్పుడు లెక్కలు చెబుతూ పారదర్శకంగా వ్యవహరించడంలేదనేది జగమెరిగిన సత్యం. ముందు నుంచి చైనా పాలకులది నియంతృత్వ ధోరణే. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించేవారిని కఠినంగా శిక్షించడం.. నోళ్లు తెరిస్తే వారిని జైళ్లో పెట్టి గొంతు నొక్కడం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క ఫిర్యాదు కూడా చేయడానికి వీల్లేదు. ఇప్పుడు కరోనా వైరస్ విషయంలోనూ అదే జరుగుతోంది.

దీని గురించి ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, వాళ్లకు నరకయాతన తప్పడం లేదు. ఇందుకు వైరస్ గురించి తొలినాళ్లలో హెచ్చరించిన వైద్యుడు లీ వెన్‌‌ లియాంగ్ ఉదంతమే నిదర్శనం. అలా ప్రశ్నించిన వారి నోరు నొక్కేందుకు చైనా ప్రయత్నిస్తోందని తాజాగా న్యూయార్క్‌ టైమ్స్‌ ప్రత్యేక కథనం వెలువరించింది.

వుహాన్‌ నగరంలో ఏడుగురు సభ్యులుండే ఓ కుటుంబం మహమ్మారి బారిన పడి తీవ్రంగా నష్టపోయింది. కుటుంబంలో కొందరు మహమ్మారికి బలవ్వగా.. మరికొందరు కోలుకున్నారు. ఆప్తులను కోల్పోయినవారు చైనా ప్రభుత్వం చేసిన తప్పిదాలను నిలదీయాలని అనుకున్నారు. దీంతో వారు న్యాయపోరాటానికి సిద్ధంకాగా.. ఆదిలోనే ఆటంకం ఎదురయ్యింది. ఓ లాయర్‌‌ను సంప్రదించగా.. అక్కడా వ్యతిరేకత వచ్చింది.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా లాసూట్‌ వేయడానికి ఒప్పుకోని లాయర్లు.. దీనికి తాము సహకరించబోమని స్పష్టం చేశారు. అంతేకాదు, ఈ విషయాన్ని అధికారులకు చేరవేయడంతో బాధితులపై బెదింపులకు పాల్పడ్డారు. ‘ఆప్తులను కోల్పోయాం. వారి మరణానికి కారణం అడిగితే అధికారులు మాకు శిక్షలు వేస్తున్నారని వాపోయినట్టు’ న్యూయార్క్ టైమ్స్‌ తన కథనంలో పేర్కొంది.

వీళ్లే కాదు, ఇలా ప్రశ్నించిన ప్రతి ఒక్క గొంతుకనూ చైనాలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వం నొక్కేస్తోందట. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు ప్రశ్నించినా, వారిని అణచివేయడానికి పోలీసులను రంగంలోకి దింపిందట. ‘తమ హక్కులను కోల్పోతున్నామని దేశంలోని చాలా మంది తీవ్రంగా మదనపడుతున్నారు. వుహాన్‌‌లోని కుటుంబాలు ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్ధితులను అంతర్జాతీయ సమాజం చూస్తోంది’ అని ఒకప్పుడు డ్రాగన్ చేతిలో నిర్బంధానికి గురైన హక్కుల ఉద్యమకారుడు‌ యాంగ్‌ జన్కింగ్‌ అన్నారు.

ప్రస్తుతం అమెరికాలో ప్రవాసం ఉన్న ఆయన.. ఈ విషయమై వుహాన్‌లోని రెండు, మూడు కుటుంబాలు తనని సంప్రదించాయని తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులు పెట్టడానికి ప్రయత్నించడంతో వారికి అధికారుల నుంచి బెదిరింపులు మొదలయ్యాయి. దీంతో వారు తమ కేసులను ఉపసంహరించుకున్నారని యాంగ్‌ తెలిపారు.

గతంలో ప్రమాదాలు, విపత్తలు సంభవించినప్పుడు చైనా ప్రభుత్వం బాధిత కుటుంబాల పట్ల నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించింది. సించువాన్ ప్రావిన్సుల్లో 2008లో భూకంపం సంభవించి 69,000 వేల మంది చనిపోతే, తమ పిల్లను కోల్పోయిన తల్లిదండ్రులకు అధికారులు కొంత డబ్బులిచ్చి వాస్తవాలను బయటకు రాకుండా చేశారు. అలాగే, 2011లో జరిగిన వెన్‌‌జూహు వద్ద జరిగిన ఘోరమైన రైలు ప్రమాదంలో వందలాది మంది చనిపోతే, ఆ ప్రదేశానికి మృతుల బంధువులను అనుమతించలేదు. 1989లో తియాన్మన్ స్క్యేర్ వద్ద జరిగిన ప్రజా ఆందోళన ఉద్రిక్తతకు దారితీసి అనేక మంది చనిపోయారు. దీనిపై నోరెత్తకుండా బాధిత కుటుంబాలను బెదిరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here