మీరు SBI ఖాతాదారులా..? అయితే లావాదేవీల విషయంలో జాగ్రత్త..! ఆచితూచి వ్యవహరించండి. ప్రణాళిక లేకుండా ఎడాపెడా లావాదేవీలు జరిపారో..? అంతే సంగతులు..! ఛార్జీల మోత మోగించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రంగం సిద్ధం చేసింది.
ఖాతాదారులకు షాకిచ్చేందుకు SBI సిద్ధమైంది. పెనాల్టీ, ఇతర ఛార్జీల పేరుతో ఎడాపెడా భారం మోపేందుకు రెడీ అవుతోంది. నగదు డిపాజిట్లు, నగదు ఉపసంహరణపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లక్ష్మణరేఖ గీసింది.
ఇకపై ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి విత్ డ్రా 3 సార్లు దాటితే 20 రూపాయల ఛార్జీ పడనుంది. SBI ఏటీఎంల్లో 5 సార్లు దాటితే 10 రూపాయల చొప్పున డబ్బులు కట్ కానున్నాయి. నగదు డిపాజిట్లు 3 సార్లు మాత్రమే ఉచితం. నాలుగో డిపాజిట్ నుంచి సేవాపన్నుతో పాటు 50 రూపాయలు వసూలు చేయనుంది SBI. అలాగే SMS అలర్ట్లపై మూడు నెలలకు 15 రూపాయల ఛార్జీ చేయనుంది.
మరోవైపు కనీస నిల్వ నిబంధనను మళ్లీ పునరుద్ధరించింది. మినిమమ్ బ్యాలెన్స్ నిల్వలేని ఖాతాదారులకు పెనాల్టీ విధించనుంది. అయితే 1000 రూపాయల వరకు UPI, యూఎస్ఎస్డీ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు లేవు. కరెంటు ఖాతాలో కనీసం 20 వేలు ఉండాలి. బ్యాంకు ఖాతాలో 25 వేలకన్నా ఎక్కువ మొత్తం ఉంటే సొంత ఏటీఎంల నుంచి ఎన్ని సార్లైనా నగదు ఉపసంహరించుకోవచ్చు. ఎలాంటి ఛార్జీ వసూలు చేయరు.
ఐదేళ్ల తర్వాత కొత్త ఛార్జీలను SBI అమల్లోకి తీసుకురానుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి.