అద్వానీ ఇక తెరమరుగు కావాల్సిందేనా? బీజేపీలో కురువృద్ధుడిగా ఉన్న అద్వానీకి రాష్ట్రపతి అయ్యే యోగం లేదా? ప్రధాని కావాలనుకున్న అద్వానీ కల ఎలాగూ నెరవేరలేదు. చివరకు రాష్ట్రపతి పదవి కూడా కలగానే మిగిలిపోనుందా?
బీజేపీ కురు వృద్ధుడు అద్వానీకి రాష్ట్రపతి ఛాన్స్ వస్తుందని అనుకుంటున్న సమయంలో … బాబ్రీ కూల్చివేత కేసు అడ్డుకట్టే వేసేలా కనిపిస్తోంది. బాబ్రీ కూల్చివేత కేసులో అద్వానీ సహా 13 మంది బీజేపీ నేతలపై ఉన్న అభియోగాలను కేవలం సాంకేతిక కారణాలతో తొలగించేందుకు అంగీకరించబోమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. వారిపై నమోదైన కుట్ర ఆరోపణలపై అవసరమైతే విచారణ ఎదుర్కొవాల్సి ఉంటుందని తెలిపింది. అద్వానీతోపాటు మురళీ మనోహర్ జోషీ, ఉమాభారతి, ఇతరులపై కేసు ఉపసంహరణకు సంబంధించి వాదనల సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ పదవీ కాలం ఈ జులైతో ముగియనుంది. ప్రణబ్ తర్వాత రాష్ట్రపతి పదవి… ఎవరిని వరించనున్నదనే అంశంపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. బీజేపీ సీనియర్ నేత మురళీమనోహర్ జోషి పేరు ప్రముఖంగా వినిపించినా… చివరి క్షణంలోనైనా అద్వానీ పేరు తెరమీదకు రావచ్చని బీజీపీ నేతల్లో కొంత మంది అనుకున్నారు. కానీ, సుప్రీం కోర్టు తాజా వ్యాఖ్యల నేపథ్యంలో .. ఇక అద్వానీకి రాష్ట్రపతి అయ్యే యోగం లేదనిపిస్తోంది.