దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న మే 3న ముగియనున్న నేపథ్యంలో కేంద్ర హోం శాఖ కీలక ప్రకటన చేసింది. మే 4 నుంచి చాలా జిల్లాలకు లాక్డౌన్ నిబంధనల నుంచి గణనీయమైన రీతిలో వెసులుబాటు కల్పించనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే వెలువరించనున్నారు. లాక్డౌన్ పరిస్థితిపై హోం శాఖ బుధవారం రివ్యూ మీటింగ్ నిర్వహించింది. లాక్డౌన్ కారణంగా పరిస్థితి ఎంతో మెరుగైందని తెలిపింది. మే 3 వరకు లాక్డౌన్ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
దేేశాన్ని రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లు విభజించి.. రెడ్ జోన్లలో లాక్డౌన్ పొడిగిస్తారని.. గ్రీన్ జోన్లలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ లాక్డౌన్ను ఎత్తివేస్తారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఉపాధి కోసం వేరే రాష్ట్రాలకు వలస వెళ్లిన కార్మికులు తిరిగి సొంత రాష్ట్రాలకు చేరుకోవడానికి కేంద్రం బుధవారం (ఏప్రిల్ 29న) గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులకు ఊరట లభించనుంది.
గ్రీన్ జోన్లో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో సోషల్ డిస్టెన్సింగ్, ఇతర జాగ్రత్తలు పాటిస్తూ ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభించేలా కేంద్రం వెసులుబాటు కల్పించిన సంగతి తెలిసిందే. వ్యవసాయ కార్యకలాపాలతోపాటు కొన్ని ఇతర రంగాలకు కూడా కేంద్రం లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది. కానీ మార్కెట్లు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు మూసి ఉంటాయని కేంద్రం తెలిపింది.