మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. వివేకానంద కేసులో సీబీఐ వేగంగా ముందుకు వెళుతున్నట్లు కనిపిస్తోంది. నాల్గవ రోజు సీబీఐ అధికారులు విచారణ వేగవంతం చేశారు. నిన్న ఆయన కుటుంబ సభ్యులను విచారించిన సీబీఐ నేడు మరోసారి రంగంలోకి దిగింది.
పులివెందులలోని డీఎస్పీ కార్యాలయానికి వెళ్లిన సీబీఐ హత్య కేసు వివరాలు సేకరించి నేరుగా ఆయన ఇంటికి వెళ్లారు. వివేకా భార్య సౌభాగ్యమ్మ, కుమార్తెను నాలుగు గంటల పాటు విచారించిన విషయం తెలిసిందే. ఇందులో వివేకా కుమార్తెతో సుధీర్ఘంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. కాగా నేడు వివేకా బెడ్ రూంతో పాటు, బాత్ రూం కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. వివేకా కేసులో సీబీఐ దూకుడు చూస్తుంటే త్వరగానే కేసును ముగిస్తారని అంతా చర్చించుకుంటున్నారు.
విచారణలో భాగంగా వివేకానంద రెడ్డి ఇంటి కొలతలను సీబీఐ అధికారులు తీసుకున్నారు. మున్సిపల్ సర్వేయర్లతో ఇంటిని కొలతలు వేయించి వివరాలు నమోదు చేసుకున్నారు. బాత్ రూం, బెడ్ రూముల్లో ఎన్ని గదులు, కిటికీలు ఉన్నాయో పరిశీలించారు. హత్య కేసుకు సంబంధించి తనకు తెలిసిన వివరాలు తెలియజేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన కుమార్తె సునీత ఇదివరకే సీబీఐకి చెప్పినట్లు తెలిసింది.