ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాల పార్టీ ఇంచార్జిలతో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుత కరోనా పరిస్థితి, ప్రభుత్వ వైఫల్యాలు, పార్టీ పరంగా చేయాల్సిన పనులపై ఆయన మాట్లాడారు. పార్టీ ఇంచార్జిలందరితో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి వైఖరిపై ఘాటుగా స్పందించారు చంద్రబాబు.
రాష్ట్రంలో అందరూ మాస్కులు ధరిస్తుంటే సీఎం జగన్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తే మాస్క్ ధరించకపోగా.. ఇతరులకు మాస్కులు లేకుంటే ఫైన్లు వెయ్యాలనడం సమంజసం కాదన్నారు.
ఇక అమరావతి రాజధానిగా ఉండాలన్న దానిపై ఎంతో పోరాటం చేశామని చెప్పుకొచ్చిన ఆయన.. ఇంకా వివిధ రూపాల్లో పోరాడాలన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ఏర్పడిన తర్వాత అప్పులు ఎక్కువయ్యాని వీడియో కాన్ఫరెన్స్లో ప్రస్తావన వచ్చింది. ఈ సందర్బంలో చంద్రబాబు మాట్లాడుతూ ఎపీ ఎక్కువ అప్పులు చేసిందని చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ముందుండాలని పార్టీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి అసమర్ధత వల్ల కేసులు ఎక్కువగా పెరిగిపోతున్నాయని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే వైసీపీ నేతలు మాత్రం కరోనా మహమ్మారిని అరికట్టేందుకు దేశంలో మన రాష్ట్రమే చాలా బాగా పనిచేస్తోందని చెబుతున్నారు. కేసులు నమోదవుతున్నా డిశ్చార్జుల రేటు కూడా ఎక్కువగా ఉన్న విషయం మనకు తెలిసిందే.