రమేష్ బెంగళూరు నుంచి తన సొంతూరైన (కానూరు) విజయవాడకు వచ్చాడు. అతడు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. ఎలాంటి ఇబ్బందులు లేవు. అయితే రమేష్ బెంగళూరు నుంచి ఇంటికి వచ్చాడని తెలుసుకున్న ఓ వ్యక్తి రమేష్ వద్దకు వచ్చి వివరాలు ఆరా తీశాడు. ఎప్పుడు వచ్చారు, ఎలా ఉన్నారు, ఇంట్లో అందరూ బాగున్నారా, ఎవరికైనా ఇబ్బందులు ఉంటే నాకు చెప్పండి నేను చూసుకుంటా అన్నాడు. సరే అని బదులివ్వడం రమేష్ వంతైంది. ఆ రోజు గడిచి పోయింది.. మళ్లీ రెండో రోజు అదే పద్దతి.. వివరాలు అడగడం పూర్తయ్యింది. ఆ తర్వాత రమేష్ అతన్ని మీరెవ్వరని అడగ్గా తాను విలేజ్ వాలంటీర్ అని.
అవును విలేజ్లో ఇప్పుడు ఇలాంటి పరిస్థితే ఉంది. ఒకప్పుడు మనం ఎలా ఉన్నామా అని అడిగితే అది మన కుటుంబ సభ్యులో, లేక పక్కింటి వారో అయ్యిండేవారు. కానీ ఇప్పుడు మన బాగోగులు చూసుకునేందుకు ప్రభుత్వమే మన దగ్గరకు వాలంటీర్లను పంపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ఏర్పడిన తర్వాత తీసుకున్న బృహత్తర నిర్ణయాల్లో గ్రామ వాలంటీర్ల వ్యవస్థ చాలా కీలకమైంది.
మొదట్లో అనవసరమైన నిర్ణయాలు తీసుకున్నారని ముఖ్యమంత్రిపై పలువురు దుమ్మెత్తిపోసినా ఇప్పుడు వారు సైతం నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే విలేజ్ వాలెంటీర్ పని తీరు అంత బాగుందని చెప్పొచ్చు. కరోనా వచ్చి ఎవ్వరి ఇంట్లో వాళ్లు ఉండాల్సిన ఈ పరిస్థితుల్లో ప్రాణాలు లెక్క చెయ్యకుండా తనకు అప్పజెప్పిన కుటుంబాల వద్దకు వెళ్లి వారి ఆరోగ్యపరిస్థితిని వాలంటీర్లు తెలుసుకుంటున్నారు. ప్రతి రోజూ ఇళ్ల వద్దకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు. టెంపరేచర్ చూడటంతో పాటు ఇతర సమస్యలను గుర్తిస్తున్నారు. తద్వారా వారి జీవితాలను సేఫ్ చెయ్యడమే కాకుండా ఇతరులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ముఖ్య పాత్ర పోషించడంలో వాలంటీర్ల వ్యవస్థ చాలా కీలకంగా ఉంది.
బస్తా సంచిలో ఒకటి రెండు రాళ్లు ఉన్నట్లు.. వాలంటీర్లలో కొందరు చేస్తున్న తప్పులకు అందరినీ బాధ్యులను చేయడం సరైంది కాదు. రాష్ట్రంలో 2,50,000 మంది వాలంటీర్లు ఉన్నారు. ప్రతి యాబై కుటుంబాలకు ఒక వాలంటీర్ను ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ నియమించారు. వీరంతా ఎవరి పరిధిలో ఉన్న ఆ కుటుంబాలకు సంబంధించిన పూర్తి బాధ్యతను నిర్వర్తిస్తారు.
ప్రధానంగా ఒకటో తేదీనే పించన్ ఇవ్వడం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలవుతోంది. ఎందుకంటే ప్రతి నెలా పించన్ల కోసం లబ్దిదారులు ఎన్నో ఇబ్బందులు పడేవారు. ఇది అందరికి తెలిసిన విషయమే. అలాంటిది వాలంటీర్ల వ్యవస్థ వచ్చినప్పటి నుంచి లబ్దిదారుల ఇళ్ల వద్దకు ఉదయాన్నే వచ్చి వాలంటీర్లు నగదు రూపంలో పించన్ అందజేస్తున్నారు. ఈ విషయంలో రాష్ట్రంలోని ప్రతి పించన్ దారుడు సంతోషం వ్యక్తం చేస్తూ వైఎస్ జగన్కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు.
ఒక్క పించనే కాకుండా రైతు భరోసా నమోదు వివరాలు, వైఎస్సార్ చేయూత, జగనన్న చేదోడుతో పాటు ప్రతి ప్రభుత్వ సంక్షేమ పథకంకు సంబంధించి వాలంటీర్లు ప్రజలతో మమేకమవుతూనే ఉన్నారు. గ్రామాల్లో రేషన్, ఆధార్, పించన్, తదితర ఏ సమస్యలు ఉన్నా ముందుగా ఇప్పుడు వాలంటీర్లనే సంప్రదిస్తున్నారంటే ఏ విధంగా వాలంటీర్ల వ్యవస్థ ఏర్పడిందో మనకు అర్థమవుతోంది. ఇప్పుడున్న విపత్కర కరోనా పరిస్థితుల్లో వాలంటీర్లు వ్యవహరిస్తున్న తీరు హర్షించదగ్గ విషయమే. ప్రజలకు ఏ పని అవసరమున్నా నిర్మొహమాటంగా వాలంటీర్లు ముందుకొస్తున్నారు.
ఏదిఏమైనా పేదల ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం ఆలోచిస్తానంటున్న సీఎం జగన్… వాలంటీర్ల వ్యవస్థతో పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయాడని మాత్రం చెప్పొచ్చు.