జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడు రాజధానుల అంశంపై స్పందించారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ అమరావతికి అనుకూలమని ప్రజలు నమ్మారని చెప్పారు. జనసేనను ఎలా ప్రశ్నిస్తారన్నారు.
రైతులకు అండగా ఉండాలనుకుంటే తెలుగుదేశం పార్టీకి చెందిన అందరు ఎమ్మెల్యేలు, వైకాపాకు చెందిన కృష్ణా, గుంటూరు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలన్నారు. జనసేనకు శాసనసభలో ఎలాంటి పాత్ర ఉన్నా ముందగా రాజీనామాలు చేసేవాళ్లమని పవన్ అన్నారు. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వైసీపీ రాజకీయాలు చేస్తోందని అన్నారు.
వికేంద్రీకరణపై న్యాయ పరంగా చర్చిస్తామని ఆ తర్వాతే ఏం చేయాలన్న దానిపై ముందుకు వెళతామన్నారు. అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం రైతుల నుంచి భూములు సేకరించినప్పుడే ప్రభుత్వం మారితే రైతుల పరిస్థితి ఏమిటని తాను ప్రశ్నించినట్లు పవన్ చెప్పారు. వ్యక్తిగత అజెండాలు, పార్టీల నిర్ణయాలను బట్టి రాజధానులు మారవన్నారు.
కరోనా నివారణ చర్యలు చేపట్టలేని ప్రభుత్వం.. ప్రజల దృష్టి మరల్చేందుకు ఇలా చేస్తోందన్నారు. చూద్దాం మరి అమరావతి రైతుల సమస్యపై పవన్ ఏ విధంగా ముందుకు వెళతారో.