రానున్నరోజుల్లో కరోనా తీవ్రత పెరిగే అవకాశం ఉందా అంటే సరైన సమాధానం లేదు. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కొంచెం ఆందోళన కలిగిస్తున్నాయి. లక్ష మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేంద్రం ఎందుకు కొనుగోలు చేస్తుందన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
కరోనా వైరస్ సోకిన వారు ప్రధానంగా శ్వాసకోశ సంబంధ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. చలి కాలం వచ్చిందంటే వీరు చాలా ఇబ్బందులు పడతారు. అయితే చలికాలంలో కరోనా ముప్పు మరింత పెరగవచ్చని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ఆక్సిజన్ కొనుగోలు చేయాలని చూస్తోంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఇటీవల జరిగిన క్యాబినెట్ మీటింగ్లో కరోనా బాధితులకు అవసరమయ్యే ఆక్సిజన్ విషయమై చర్చకు వచ్చింది. ప్రస్తుతం దేశంలో తగినంత స్థాయిలో ఆక్సిజన్ ఉంది.
అయితే భవిష్యత్ అవసరాలకు మరింత ఆక్సిజన్ కావాల్సివుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం విదేశాల నుంచి లక్ష మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కొనుగోలు చేయాలని యోచిస్తోంది. రాబోయే కరోనా పీక్ స్టేజ్ను దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం అందుకు తగిన నివారణ చర్యలు ప్రారంభించింది. కరోనాతో తీవ్రంగా బాధపడుతున్నవారి కోసం ఆక్సజన్ అందుబాటులో ఉంచేందుకు లక్ష మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను విదేశాల నుంచి కొనుగోలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం ఒక టెండర్ కూడా విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో ఒకరోజుకు ఏడు వేల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. ఈ మొత్తంలో 3,094 టన్నుల ఆక్సిజన్ను కరోనాతో పాటు ఇతర బాధితుల అవసరాల కోసం వినియోగిస్తున్నారు.
లాక్డౌన్కు ముందు దేశంలో లక్ష మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి అయ్యేది. దీనిలో వెయ్యి మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను రోగులకు వినియోగించేవారు. దేశంలో కరోనా వ్యాప్తి చెందిన తరువాత కరోనా బాధితుల కోసం ఆక్సిజన్ అవసరత మూడురెట్లు పెరిగింది. దీంతో దేశంలో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఈ కొరతను తీర్చేందుకు ప్రభుత్వం ఆక్సిజన్ కొనుగోలు చేయాలని అనుకుంటోంది.