ఆంధ్రప్రదేశ్లో అమరావతి రైతుల పరిస్థితి అంతుచిక్కడం లేదు. వేల ఎకరాల భూములు ప్రభుత్వానికి ఇచ్చి ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడ్డామని రైతులు ఆందోళనలో ఉన్నారు. తమ ప్రాంతంలోనే రాజధాని ఉండాలని నిరసనలు ఉదృతం చేస్తున్నారు.
ప్రభుత్వం ఏం హామీ ఇచ్చి రైతుల వద్ద భూములు తీసుకుందో అదే హామీ మేరకు తమకు న్యాయం జరుగుతుందని అమరావతి రైతులు నమ్మకంతో ఉన్నారు. ఈ మేరకు వీరు న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు చట్ట రూపం దాల్చినా న్యాయ సమీక్షకు లోబడే ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
భూములిచ్చిన రైతుల సమస్యలను పరిష్కరించకుండా సీఆర్డీఏను రద్దు చేయడం కరెక్టు కాదంటున్నారు. రైతులు తాము ఇచ్చిన భూముల ద్వారా తమకు ప్రయోజనం కలుగుతుందని ఆశతో ఉన్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మూడు రాజధానులు పెట్టడం అమరావతి రైతులను సంప్రదించి వారి సమస్యలు పరిష్కరించకుండా ముందుకు వెళ్లడం న్యాయ సమీక్షకు లోబడే ఉంటాయని పలువురు భావిస్తున్నారు.
గత ప్రభుత్వాలు తీసుకున్న విధాన పరమైన నిర్ణయాలను ఇష్టాసారంగా మార్చకూడదని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్చు ఇచ్చిందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటకే అమరావతిలో రూ. 10వేల కోట్లు ఖర్చైన నేపథ్యంలో ప్రజాధనం రక్షణ బాధ్యత కోర్టులపైనే ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద అమరావతి రైతులు మూడురాజధానుల విషయంపై న్యాయ పరంగా పోరాడేందుకు సిద్ధమయ్యారు.