మూడు రాజధానులకు వ్యతిరేకమని చెబుతున్న తెలుగుదేశం పార్టీ కేవలం మాటలకే పరిమితమైనట్లు కనిపిస్తోంది. ఎందుకంటే మొన్న గవర్నర్ వద్ద బిల్లు పాస్ అవ్వగానే ఆ పార్టీ నేతలు అగ్గిమీదగుగ్గిలమైన దాన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో ఏం జరుగబోతోందో అన్న సంకేతాలు వచ్చాయి. తీరా చూస్తే ఇప్పటిదాకా ఏం జరగలేదు..
రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు గవర్నర్ వద్ద ఆమోదం పొందిన వెంటనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల మద్దతుకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇలా వ్యవహరించడం కరెక్టు కాదని మండిపడ్డారు. దీనిపై పోరాటం చేస్తామన్నారు. అవసరమైతే రాజీనామాలు చేసి న్యాయపోరాటం చేస్తామన్నారు.
గవర్నర్ బిల్లును ఆమోదించడం సరైంది కాదన్నారు. ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మరో ప్రభుత్వం మార్చడం ఏంటని నిలదీశారు. అయితే చంద్రబాబు మాటలు విన్న తర్వాత ఆంధ్రప్రదేశ్లోని ప్రతి పౌరుడు రాష్ట్రంలో ప్రజల మద్దతు లేనిదే సీఎం వై.ఎస్ జగన్ రాజధాని విషయంలో నిర్ణయం తీసుకున్నారా అన్న సందేహం మొదలైంది. అయితే ఇప్పుడిప్పుడే ప్రజలు ఓ క్లారిటీ వస్తోంది.
తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మూడు రాజధానుల అంశానికి వ్యతిరేకంగా రాజీనామాలు చేస్తారని అంతా అనుకున్నారు. ఈ మేరకు ఆ పార్టీ నేతల నుంచి లీకులు కూడా అదేవిధంగా బయటకు వచ్చాయి. ఓ క్రమంలో మరి కాసేపట్లో రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేస్తారన్న ప్రచారం సాగింది. అయితే ఇది మాత్రం ఎక్కడా జరగలేదు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలెవ్వరూ రాజీనామా చేయలేదు.
ఎమ్మెల్యేల మాట పక్కన పెడితే అమరావతి రైతుల కోసం ఎంతవరకైనా పోరాడతామని చెబుతున్న చంద్రబాబు ముందుగా రాజీనామా చేయాలని పొలిటికల్ చర్చ నడుస్తోంది. ఆయన రాజీనామా చేస్తే కానీ పార్టీ ఎమ్మెల్యేలెవ్వరూ రాజీనామా చెయ్యరంటున్నారు మేధావులు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన కుమారుడు లోకేష్కు ఎమ్మెల్సీ పదవి వచ్చింది. అయితే పార్టీ అధికారంలో లేకపోయినా ఎమ్మెల్సీ పదవీ కాలం ఇంకా ఉంది కాబట్టి లోకేష్ ఇంకా పదవిలోనే కొనసాగుతున్నారు. అయితే ముందుగా చంద్రబాబు, లోకేష్ అమరావతి రైతుల కోసం రాజీనామా చేయాలని.. అలా చేయకుండా పార్టీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయాలనడం ఎంతవరకు సమంజసమని రాజకీయ పార్టీల్లో చర్చ జరుగుతోంది.
ఇక రాయలసీమలోని ఎమ్మెల్సీ బి.టెక్ రవి మాత్రం తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేసినప్పటి నుంచి తాను రాయలసీమ ప్రాంతం నుంచి రాజీనామా చేసినా వైసీపీ నేతలు ఇంతవరకు రాజీనామాలు చేయలేదని అంటున్నారు. అయితే మామూలుగా విజయవాడు, గుంటూరు, ప్రాంతాల టిడిపి ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే అమరావతి కోసం చేశారని అనుకోవచ్చు. అలా కాకుండా రాయలసీమ ఎమ్మెల్సీ రాజీనామా చేయడం కేవలం చంద్రబాబు స్కెచ్ అని అంటున్నారు. ఒకవేళ ఎమ్మెల్సీ రాజీనామా చేయాల్సి వస్తే లోకేష్తో రాజీనామా చేయించవచ్చు కదా అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మొత్తానికి మూడు రాజధానులకు వ్యతిరేకంగా రాజీనామాలు చేస్తామని సంకేతాలు ఇస్తున్న చంద్రబాబు పార్టీ వాళ్లు ఆ దిశగా ఆలోచించడం లేదని అర్థమవుతోంది. ఒకవేళ రాజీనామా చేసినా అందులో చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ రాజీనామలు మాత్రం ఉండటం కష్టమని అంటున్నారు. నిజంగా చంద్రబాబుకు అమరావతి రైతులపై ప్రేమ ఉంటే పదవులను ఎప్పుడో వదులుకునేవారు. మళ్లీ ఎన్నికల్లో గెలిస్తామా అన్న విషయం పక్కనపెడితే ఈ సారి మూడు రాజధానుల కోసం చంద్రబాబు పార్టీ పోరాడిందన్న ఘనత అయినా టిడిపికి దక్కుతుందన్నది వాస్తవమే. మరి ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.