తిరుమలపై కరోనా ప్రభావం కనిపిస్తోంది. ఇప్పటికే టీటీడీలో 150మందికిపైగా కరోనా సోకగా.. 18మంది అర్చకులు వైరస్ బారినపడ్డారు. అంతేకాదు ఆలయ పెద్ద జీయంగారికి కూడా పాజిటివ్ తేలడం కలకలంరేపింది. అయితే తాజాగా తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు శ్రీనివాసమూర్తి దీక్షితులు కరోనాతో కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితం దీక్షితులు కరోనా బారిన పడ్డారు.. నాలుగు రోజులుగా తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు.
శ్రీనివాసమూర్తి దీక్షితులు తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడిగా దాదాపు 20ఏళ్లకు పైగా సేవలు అందించారు. ఆయనకు ఆలయం తరపున సంప్రదాయ పద్దతిలో వీడ్కోలు పలకనున్నారు. అయితే దీక్షితులు కరోనా వైరస్ బారిన పడి మృతి చెందడంతో మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించే అవకాశం లేని పరిస్థితి ఉంది. ఆయన మరణానికి పలువురు సంతాపాన్ని వ్యక్తం చేశారు.