ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనాలపై ఆందోళన మొదలైంది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఏ చేద్దామని తిరుమల తిరుపతి దేవస్థానం ఆలోచనలో పడింది.
తిరుమలలో భక్తుల దర్శనాలపై తితిదే రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించింది. తిరుమలలో విధులు నిర్వహిస్తున్న పలువురికి కరోనా సోకింది. దీంతో పాటు తిరుపతిలో పరిపాలనా భవనంలో సిబ్బంది వైరస్ బారిన పడ్డారు. వీరిలో శ్రీవారి కైంకర్యాల బాధ్యతలు నిర్వహిస్తున్న ఇద్దరు ప్రముఖులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన టిటిడి ప్రభుత్వానికి ప్రత్యేకంగా నివేదిక అందజేసినట్లు తెలుస్తోంది.
తిరుమల, తిరుపతిలో కేసులు తీవ్రతను బట్టి భక్తులకు దర్శనాలు నిలిపివేయాలని పలు రూపాల్లో ఇప్పటికే పలువురు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏం చెప్పనుందో దాన్ని బట్టి తుది నిర్ణయం తీసుకోవాలని తితిదే యోచిస్తున్నట్లు సమాచారం. కంటెయిన్మెంట్ నిబంధల ప్రకారం అలిపిరిలోని శ్రీభూదేవి కాంప్లెక్సులో సర్వదర్శనం టైమ్స్లాట్ టెకెన్లను మంగళవారం నుంచి నిలిపివేస్తున్నారు.
ఈ పరిణామాలన్నీ పరిశీలిస్తే మళ్లీ దర్శనాలకు బ్రేక్ పడుతుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. శ్రీవారి దర్శన భాగ్యం కోసం ఎదురుచూస్తున్న వారు మళ్లీ దర్శనాలు నిలిపివేస్తారన్న వార్తలతో ఒకింత ఆందోళనలో ఉన్నారు. మరి ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తుందో వేచి చూడాలి..