ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని రైల్వే శాఖ అన్ని చర్యలు చేపట్టింది. దేశ వ్యాప్తంగా ప్రజల రవాణాకు ఇబ్బందులు కలుగకుండా అదనపు రైళ్లు తీసుకొస్తుంది. అయితే పండుగల సీజన్ను దృష్టిలో పెట్టుకొని అధిక సంఖ్యలో ప్రయాణీకులు వచ్చే అవకాశం ఉంది. దీంతో కీలక నిర్ణయం తీసుకుంది.
రైళ్ల కోసం రైల్వే స్టేషన్కు వచ్చే వారు, రైళ్లలో ప్రయాణించే వారు తప్పనిసరిగా కొన్ని రూల్స్ పాటించాలని ఆదేశాలు జారీచేసింది. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే రైల్వే చట్టం 1989 పలు సెక్షన్ల కింద జైలు శిక్ష లేదా జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఇందులో ప్రధానంగా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడంతో పాటు బౌతకదూరం పాటించాల్సి ఉంటుంది. ఇక కరోనా పాజిటివ్ అని తెలిసిన వ్యక్తులెవ్వరూ రైళ్లలో ప్రయాణం చేయకూడదని, అసలు రైల్వే స్టేషన్ను కూడా రావొద్దని సూచించింది. ఒకవేళ కరోనా పరీక్ష చేయించుకొని రిపోర్టు కోసం ఎదురుచూస్తున్న వారు కూడా ప్రయాణాలు చేయకూడదని తెలిపింది.
రానున్న పండుగలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే రైల్వే శాఖ అదనపు రైల్లు ప్రవేశపెట్టింది. వీటికి రిజర్వేషన్లు కూడా అయిపోయాయి. ఎప్పుడూ లేనంతగా నాలుగు నెలల ముందుగానే రైల్వే రిజర్వేషన్లు ఫుల్ అయ్యాయి. కరోనా విజృంభిస్తున్న తరుణంలో వీటన్నింటిని పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖకు తగు మార్గదర్శకాలు జారీచేసింది. ఇక దక్షిణ మధ్య రైల్వే 10 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. కాకినాడ.. లింగంపల్లి, తిరుపతి, విజయవాడ, హుబ్లీ, అమరావతి మార్గాల్లో ఇవి తిరుగుతాయి. దసరా పండుగ వస్తున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకుంది. రైల్వే స్టేషన్కు వెళ్లే వారు కానీ, రైళ్లలో ప్రయాణించే వారు కానీ కచ్చితంగా ఈ నిబంధనలు పాటించాలి. లేదంటే భారీ మూల్యం చెల్లించక తప్పదు.