ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. వరద సహాయ చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. వర్షం ధాటికి ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో అన్న విషయం కేంద్రం దృష్టికి వెళ్లింది. దీంతో ప్రధానిమోదీ లైన్లోకి వచ్చారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు వై.ఎస్ జగన్, కేసీఆర్లకు మోదీ ఫోన్ చేశారు. వరద పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎందుకిలాంటి పరిస్థితి ఏర్పడిందని ఆరా తీశారు. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయం అందిస్తుందని మోదీ హామీ ఇచ్చారు. అనంతరం మోదీ ట్విట్టర్లో కూడా ట్వీట్ చేశారు. భారీ వర్షాల వల్ల ఉత్పన్నమయిన పరిస్థితులపై తెలుగు రాష్ట్రాల సీఎంలైన కేసీఆర్, జగన్లతో మాట్లాడినట్లు ఆయన ట్వీట్లో వివరించారు. వారికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయం అందిస్తుందని హామీ ఇచ్చినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
వర్షాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని ట్వీట్ చేశారు. ప్రధానమంత్రి తెలుగులో ట్వీట్ చేశారు. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం ఆయన ఈ విధంగా వినూత్నంగా ట్వీట్ చేశారని అంతా అనుకుంటున్నారు. ఇక తెలంగాణాలో వర్షం భీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో రెండు రోజుల పాటు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అవసరమైతే తప్ప ప్రజలు మూడు రోజుల పాటు బయటకు రావొద్దని సూచనలు జారీ చేసింది. పలుచోట్ల 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రికార్డు స్థాయిలో మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో 31.9సెంటీమీటర్లు, రంగారెడ్డి జిల్లా హయత్నగర్లో 29.13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.