కరోనా కేసులు పెరుగుతూ ఓ వైపు ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. ఇదే సమయంలో వ్యాక్సిన్ కోసం శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇతర దేశాలకు అండగా ఉండాల్సిన అగ్రదేశాలు వ్యాక్సిన్ విషయంలో వ్యవహరిస్తున్న తీరు అందరినీ ప్రశ్నించేలా చేస్తోంది.
పలు కంపెనీల వ్యాక్సిన్లులు తుది దశ ప్రయోగాల్లో ఉన్నాయి. దీంతో ఇప్పటి నుంచే పలు దేశాలు ఈ వ్యాక్సిన్ను బుక్ చేసుకునేందుకు క్యూ కట్టాయి. ఈ తరుణంలో పలు దేశాలు కావాల్సిన దానికంటే ఎక్కువగానే వ్యాక్సిన్ను బుక్ చేసుకుంటున్నాయని తేలింది. ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అమెరికా, బ్రిటన్ దేశాలు తమ దేశంలోని ప్రతీ వ్యక్తికి ఐదేసి డోసుల చొప్పున ప్రీ బుకింగ్ చేశాయి. ప్రపంచ జనాభాలో ధనిక దేశాల జనాభా 13 శాతంగా ఉంది. అయితే వ్యాక్సిన్ డోసులలోని 50 శాతాన్ని ఆయా దేశాలే ముందుగా బుక్ చేసుకున్నాయి. వ్యాక్సిన్ డోసేజీ విషయంలో ధనిక దేశాలు చూపిస్తున్న తాపత్రయం కారణంగా వ్యాక్సిన్ ధరలు పెరిగి, ఆ ప్రభావం మిగిలిన దేశాలపై పడే అవకాశం ఉంది.
ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు ఏఏ దేశాలు ఎంత వ్యాక్సిన్ బుక్ చేసుకున్నాయంటే. అమెరికా 2,400 మిలియన్ల డోసులు, యూరోపియన్ యూనియన్ దేశాలు 2,065 మిలియన్ల డోసులు, బ్రిటన్ 380 మిలియన్ల డోసులు, కెనడా 338 మిలియన్ల డోసులు, ఇండోనేషియా 328 మిలియన్ల డోసులు, చైనా 300 మిలియన్ల డోసులు. జపాన్ 290 మిలియన్ డోసుల కరోనా వ్యాక్సిన్ను ప్రీ బుకింగ్ చేసుకున్నాయి. ప్రపంచంలోని పేద దేశాలకు 3,200 మిలియన్ల డోసుల కరోనా వ్యాక్సిన్ కేటాయించారు. ఈ విధంగా వ్యాక్సిన్ కోసం పోటీపడటం వలన ఈ వ్యాధి తగ్గికపోగా, మరింత వ్యాప్తి చెందుందని మేధావులు చెబుతున్నారు.