ప్రముఖ సినీనటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారును ట్యాంకర్ వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆమెకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. బుదవారం ఆమె కడలూరు వెళ్తుండగా మార్గమద్యంలో మెల్మర్వతూర్ వద్ద కారును ట్యాంకర్ ఢీ కొట్టింది. అప్పుడు వెంటనే కారులోని ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో ఆమెకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.
అనంతరం ఆమె యాక్సిడెంట్ గురించి సోషల్ మీడియాలో తెలిపారు. రోడ్డు ప్రమాదం నుంచి తనను మురుగన్ దేవుడే కాపాడారని ఖుష్బూ అన్నారు. తాను ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డానని, ఈ ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని ఖుష్బూ చెప్పారు. తనకు, తన భర్తకు మురుగన్ పై నమ్మకం ఉందని చెప్పారు. ఖుష్బూ ప్రయాణిస్తున్న కారును కంటైనర్ ఢీకొన్న ఘటనలో ఏమైనా కుట్ర కోణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఖుష్బూకు యాక్సిడెంట్ అయ్యిందన్న వార్త తెలియగానే ఆమె అభిమానులతో పాటు, బీజేపీ నేతలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఇటీవల కాంగ్రెస్ను వీడి ఖుష్బూ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆమె రాజకీయంగా చాలా యాక్టీవ్గానే కనిపిస్తున్నారు. బీజేపీ అధిష్టానం ఆమెను రాజ్యసభకు పంపిస్తారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆమెకు ప్రమాదం జరగడం చర్చనీయాంశం అవుతోంది.