దేశంలో అందరి దృష్టినీ ఆకర్షించే రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటని చెప్పొచ్చు. దివంగత నాయకురాలు జయలలిత మరణానంతరం అక్కడ రాజకీయాలు ఊహలకు అందని విధంగా మారిపోయాయి. వచ్చే సంవత్సరం తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్నాయి.
తమిళ రాజకీయాల్లో కీలక నాయకురాలు శశికళ ప్రస్తుతం జైలులో ఉన్నారు. అక్రమార్జన కేసులో సుప్రీంకోర్టు విధించిన రూ.10 కోట్ల జరిమానాను వారంలోగా చెల్లించేందుకు శశికళ సిద్ధమవుతున్నారు. అక్రమార్జన కేసులో శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష విధించింది. ప్రస్తుతం బెంగుళూరు పరప్పణ అగ్రహారం జైలులో ఆమె శిక్ష అనుభవిస్తున్నారు. వచ్చే యేడాది ఫిబ్రవరి 14 వరకూ ఆమె జైలుశిక్ష అనుభవించాల్సి ఉన్నప్పటికీ సత్ప్రవర్తన తదితర కారణాల వల్లే జనవరి 27న ఆమెను విడుదల చేసే అవకాశం ఉందని కర్నాటక జైళ్ల శాఖ ఉన్నతాధికారులు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో శశికళ తరపున రూ.10 కోట్ల జరిమాన సొమ్మును కర్నాటక కోర్టులో చెల్లించేందుకు ఆమె తరఫు న్యాయవాదులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం దీపావళి సెలవుల తర్వాత కర్నాటకలో కోర్టులన్నీ పునఃప్రారంభమయ్యాయి. దీంతో వారం లోగా శశికళ తరపున జరిమానా సొమ్మును ఆమె తరఫు న్యాయవాదులు కోర్టులో చెల్లించనున్నారు. శశికళ బయటకు వచ్చాక రాజకీయాలు ఏ విధంగా ఉంటాయో అన్న ఉత్కంఠత ఇప్పుటు తమిళనాడులో నెలకొంది. ఇక ఇటీవలె బీహార్ ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలు సాధించింది. వచ్చే యేడాది జరుగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బిహార్ ఎన్నికల ఫలితాలు ప్రభావం చూపవని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దినేష్ గుండూరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకూ బలం పెరుగుతోందని, పార్టీ అభ్యర్థులు గెలవడానికి అవకాశమున్న నియోజకవర్గాలను కూడా గుర్తించామని ఆయన తెలిపారు.