వర్షాలతో ఇప్పటికే తడిసి ముద్దయిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా వరుణుడు వదలడం లేదు. తెలంగాణాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
మధ్య బంగాళా ఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో 5.8 కిలోమీటర్ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో మధ్య బంగాళాఖాతంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో ఇది తీవ్ర అల్పపీడనంగా మారనుందని, దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ అలర్ట్ జారీ చేసింది.
రానున్న రెండ్రోజుల పాటు రాష్ట్రంలో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. మరోవైపు రాష్ట్రంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ అంచనాల నేపథ్యంలో తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాగా ఇప్పటికే వర్షం ధాటికి కుదేలైన ప్రజలు మరి కొన్నిరోజులు ఇబ్బందులు పడగ తప్పడం లేదు.