ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడుగా సోము వీర్రాజు వచ్చిన తర్వాత పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే పలువురు నాయకులను ఆయన ఇదివరకు సస్పెండ్ చేశారు. కాగా ఇప్పుడు మరో నేత, అధికార ప్రతినిధి లంకా దినకర్కు ఆ పార్టీ షాకిచ్చింది. దినకర్పై సస్పెన్షన్ వేటు వేస్తూ ప్రకటన విడుదల చేసింది.
బీజేపీ రాష్ట్ర విభాగం అనుమతులు లేకుండా టీవీ చర్చల్లో పాల్గొన్న కారణంగా లంకా దినకర్కు జులైలో షోకాజ్ నోటీసులు ఇచ్చింది. దీనికి దినకర్ ఇచ్చిన సమాదానం సంతృప్తికరంగా లేకపోవడంతో ఈ నెల 19న పార్టీ ఆయన్ను సస్పెండ్ చేస్తూ ప్రకటన విడుదల చేసింది. పార్టీ నియమాలకు విరుద్ధంగా, సొంత అజెండాతో టీవీ చర్చల్లో పాల్గొంటున్నారన్న కారణంగా ఆయనపై చర్యలు తీసుకున్నారు.
జూలై 26న జరిగిన మీడియా చర్చలో పాల్గొన్నందుకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని, అందుకు ఆయన సరైన వివరణ ఇవ్వని కారణంగా సస్పెండ్ చేశామని పార్టీ పేర్కొంది. దినకర్ గతంలో టీడీపీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీజేపీలో చేరారు. ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తున్నారు. పార్టీ గీతదాటిన వారిపై వేటు వేస్తున్నారు. అయితే గత అధ్యక్షుడు ఉన్నంత వరకు వీరికి అడ్డు లేకుండా ఉండేదన్న చర్చ సైతం రాజకీయ వర్గాల్లో సాగుతోంది. మరి సోము వీర్రాజు ఇంకెంత మంది నేతలపై దృష్టి సారించారో మరి.