తెలుగు రాష్ట్రాలను వర్షాలు వదలడం లేదు. ఆంధ్రప్రదేశ్లో వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ప్రధానంగా గోదావర జిల్లాలతో పాటు కోస్తాంద్ర ప్రాంతంలో వర్షాలు భీభత్సం సృష్టించాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీటిలో మునిగిపోయాయి. ఇక హైదరాబాద్లో వర్షం ధాటికి ప్రజలు అల్లాడిపోతున్నారు.
ఇప్పటికే వర్షంతో కోలుకోలేకపోతుంటే మరో రెండు మూడు రోజులు వర్షాలు కురుస్తాయన్న వాతవరణ శాఖ అధికారుల హెచ్చరికలతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. రాబోయే నాలుగైదు గంటల్లో ఏపీలో ఎక్కడెక్కడ వర్షాలు పడుతాయో అంచనా వేశారు అధికారులు. రాగల నాలుగైదు గంటలు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. విశాఖ, ఉభయ గోదావరిజిల్లాలు, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి జల్లులు పడే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. సురక్షిత ప్రాంతాల్లో మాత్రమే నివాసముండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. కాగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే వర్షాలు, వరదలపై అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఎప్పటికప్పుడు అధికారులను అలర్ట్ చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, అధికారులు కూడా వర్షాలు, వరదలపై అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా హైదరాబాద్లో పరిస్థితి దయనీయంగా ఉంది. వర్షం వస్తే చాలు లోతట్టు ప్రాంతాలన్నీ నీటిలో ఉండిపోతున్నాయి. దీంతో ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటామని చెబుతోంది.