‘బాద్షా’ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది నటి రీతూవర్మ. ఈ సినిమాలో రీతూది చాలా చిన్న పాత్ర. అయితే ఈ సినిమా తర్వాత ‘ప్రేమ ఇష్క్ కాదల్’లో నటించిన తనదైన నటన ప్రదర్శించింది. అనంతరం ‘ఎవడే సుబ్రమణ్యం’లో నాని సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఇక విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘పెళ్లి చూపులు’ సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుందీ అందాల తార. ఈ సినిమాలో తన క్యూట్ నటనతో ఆకట్టుకుందీ బ్యూటీ. ఇక అనంతరం పలు విజయవంతమైన చిత్రాల్లో నటిస్తూ వస్తోంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం టక్ జగదీష్ చిత్రంలో నటిస్తోన్న ఈ చిన్నది తాజాగా మరో భారీ అవకాశాన్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏకంగా మాస్ మహా రాజా రవితేజాతో కలిసి నటించే అవకాశాన్ని దక్కించుకున్నట్లు సమాచారం. రవితేజ హీరోగా రమేశ్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో హీరోయిన్గా రీతూని తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం రీతూ వర్మను సంప్రదించారని, కథ నచ్చడంతో ఆమె కూడా సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాతో రీతూ వర్మ టాప్ హీరోయిన్ల జాబితాలో చేరుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు.