కరోనా విజృంభణ నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు దీపావళి పండుగ నేపథ్యంలో కఠిన ఆంక్షలు అమలు చేశాయి. టపాసులు కాల్చకుండా నిషేధం విధించాయి. ఇప్పుడు చైనాకు సంబందించిన టపాసులు ఎక్కడైనా కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
దీపావళి పండుగకు ముందు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చైనా పటాకుల విక్రయం, వినియోగాన్ని నిషేధిస్తూ మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. చైనా దేశ పటాకులు నిల్వ, రవాణా, విక్రయాలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు మధ్యప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.నిషేధిత చైనా పటాకులను ఎవరైనా విక్రయిస్తే వారిపై పేలుడు పదార్థాల చట్టం కింద చర్యలు తీసుకోవాలని సీఎం చౌహాన్ హోంశాఖ అధికారులు, డీజీపీని ఆదేశించారు. పేలుడు పదార్థాల చట్టంలోని సెక్షన్ 9-బి (1) (బి) ప్రకారం అక్రమ పటాకుల నిల్వ, పంపిణీ, అమ్మకం, వాడకంపై రెండేళ్ల శిక్ష విధించే నిబంధన ఉందని హోం శాఖ అదనపు చీఫ్ సెక్రటరీ రాజేష్ రాజౌరా చెప్పారు.చైనా దేశం నుంచి పటాకులను దిగుమతి చేసుకోవడం చట్టవిరుద్ధమని, దీన్ని నిషేధించామని రాజేష్ పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్ రాష్ట్ర కుమ్మరులకు ఉపాధి కల్పించేలా మట్టి దీపాలు, స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయాలని సీఎం చౌహాన్ విజ్ఞప్తి చేశారు. ఈ నెల 14వ తేదీన దీపావళి, 30వ తేదీన కార్తీక పూర్ణిమ ఉంది. దీంతో ప్రజలు బాణాసంచాను పెద్ద ఎత్తున కాల్చి సంబరాలు చేసుకుంటారు. దీంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై నిషేధం విధించాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో దీపావళి పండుగ సందర్భంగా ఒడిశా రాష్ట్రం కూడా బాణసంచా విక్రయాలు, కాల్చడంపై నిషేధం విధించింది. దీపావళి, కార్తిక పూర్ణిమ పండుగల సందర్భంగా బాణసంచా విక్రయించరాదని, కాల్చరాదని ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ నెల 10 నుంచి 30వతేదీ వరకు బాణసంచా విక్రయాలు, కాల్చడంపై నిషేధం విధిస్తున్నట్లు ఒడిశా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏకే త్రిపాఠి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.