ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ప్రధానంగా పాఠశాలలు తెరిచిన తర్వాత విద్యార్థులు, ఉపాధ్యాయులకు కరోనా సోకుతోంది. దీంతో తల్లితండ్రుల్లో ఆందోళన మొదలైంది. ఇలాగే కరోనా కేసులు పెరుగుతూపోతే స్కూళ్లు నడిపిస్తారా అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రకాశం జిల్లాలోని స్కూళ్లల్లో కరోనా కలకలం కొనసాగుతోంది. పాఠశాలలు పునః ప్రారంభమైన మూడవ రోజు కూడా కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఏడుగురు విద్యార్థులు, ముగ్గురు ఉపాధ్యాయులతో పాటు, ఓ హెచ్ఎంకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. నాగులుప్పలపాడు మండలం కనపర్తి జడ్పీ హైస్కూల్లో హెచ్ఎంతో పాటు మరో విద్యార్థి కొవిడ్ సోకింది. అటు కంభం మండలం పెద్ద నల్లకాల్వలో ఒక ఉపాధ్యాయుడు, ఇద్దరు విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తేలింది. అలాగే ఇంకొల్లు మండలం గంగవరంలో ఇద్దరు టీచర్లకు… కనిగిరి మండలం దిరిశవంచలో ఇద్దరు, పీసీ పల్లిలో ఒకరు, బేస్తవారపేట మండలం గలిజేరుగుళ్లలో ఓ విద్యార్థికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఇప్పటికే నాలుగు జడ్పీ హైస్కూల్స్లో నలుగురు ఉపాద్యాయులు, ముగ్గురు విద్యార్థులకు కరోనా వైరస్ సోకింది. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు.
ఇక విశాఖ జిల్లాలో 46 మంది ఉపాద్యాయులకు, నలుగురు సిబ్బందికి, పశ్చిమ గోదావరి జిల్లాలో 22 మంది విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులకు కరోనా నిర్దారణ అయ్యింది. కరోనా నిర్దారణ అయిన స్కూళ్లలో వెంటనే శానిటైజేషన్ చర్యలు చేపట్టారు. కాగా పలు ప్రాంతాల్లో ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులు విద్యార్థులను స్కూళ్లకు పంపుతారా లేదా అన్న ఆందోళన నెలకొంది.
కొవిడ్ రెండో దశ వార్తల నేపథ్యంలో పాఠశాలలకు పిల్లలను పంపేందుకు తల్లిదండ్రులు పునరాలోచనలో పడ్డారు. మరి ప్రభుత్వం ఈ విషయంలో ఇంకేమైనా నిర్ణయం తీసుకుంటుందా అని కొంందరు ఎదురుచూస్తున్నారు.