మనం ఇంతవరకు పులిని చూసి ఉంటాం. కానీ ఊహించని విధంగా ఉండే నల్లపులి ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఓ ఫోటో గ్రాఫర్ ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ నల్లపులి విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని అడవుల్లో మనం పులులు ఉన్నట్లు విని ఉంటాం. కొన్ని కొన్ని సార్లు వీడియోల్లో చూసి ఉంటాం. ఎందుకంటే శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్టు పరిధిలో పెద్ద పులులు ఉన్నట్లు చెబుతారు. వీటి సంతతి తగ్గిపోతుందని కూడా తెలుసు. అయితే పులుల్లో నల్ల పులి కూడా ఉంటుందా అని ఆశ్చర్యపోయేలా నల్ల పులి దర్శనమిచ్చింది. ఒడిషాలో కనిపించిన ఈ నల్లపులి గురించి ఇప్పుడు అందరూ ఆసక్తిగా తెలుసుకుంటున్నారు. సౌమెన్ బాబ్ పేయి అనే ఫోటో గ్రాఫర్ ఈ నల్లపులిని ఫోటో తీశారు. ఈ పులి చర్మంపై ఉండే మందపాటి నల్లటి చారలు శరీరంపై ఉండే నారింజరంగు జూలును కప్పేస్తాయి. అందుకే ఈ పులి నల్లగా ఉంటుందట.
ఈ ఫోటోలు వైరల్ కావడంతో ఫోటో గ్రాఫర్ సౌమెన్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అరుదైన ఈ పులిని ఫోటోలు తీయడం సంతోషించదగ్గ విషయమంటున్నారు. ఈ పులిని మెలనిస్టిక్ టైగర్ అని పిలుస్తారట. ప్రస్తుతం ఈ నల్లపులి ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. గ్రేట్ ఫోటో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.