బీహార్ ఎన్నికల్లో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓ అభ్యర్థి బిక్షమెత్తుకొని ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మరో చోట పోలీస్ శాఖలో పనిచేసిన పెద్ద అధికారికి ఎన్నికల్లో సీటు రాకుండా కానిస్టేబుల్కు సీటు వచ్చింది. ఇప్పుడు ఓ పార్టీలో తల్లి, కూతుర్లు ఉండగా.. మరో పార్టీలో తండ్రి ఉన్నారు.
దీంతో బీహార్ ఎన్నికలు ఊహించని విధంగా మలుపులు తీసుకుంటున్నాయి. తాజాగా కోమల్ సింగ్ అనే మహిళ ఎల్జీపీ నుంచి ముజఫర్పూర్ జిల్లా గైఘట్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. ఈమె తండ్రి జేడీయూలో ఎమ్మెల్సీగా ఉన్నారు. ప్రత్యర్థి పార్టీ నుంచి ఎన్నికల్లో నిలిచిన కుమార్తె తరపున ప్రచారం చేసినందుకు జేడీయూ ఎమ్మెల్సీ దినేశ్ ప్రసాద్ సింగ్ను ఆ పార్టీ నుంచి బహిష్కరించారు. ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నామనీ.. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని జేడీయూ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా ఈయన భార్య కూడా ఎల్జేపీలో ఎంపీగా కొనసాగుతున్నారు.
ఇక్కడ జేడీయూ తరుపున పోటీ చేస్తున్న అభ్యర్థిని కాకుండా తన కుమార్తెకు మద్దతుగా జేడీయూ కార్యకర్తలు ప్రచారం చేయాలని ఆమె తండ్రి దినేష్ ఒత్తిడి చేస్తున్నట్లు జేడీయూ చెబుతోంది. అందుకే ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ఆయన ఏమైనా చెప్పాలనుకుంటే లెటర్ ద్వారా చెప్పాలని ఆదేశించింది. ఇలా కూతురు కోసం తండ్రి జేడీయూ నుంచి సస్పెండ్ అయ్యారు. బీహార్ ఎన్నికలు ముగిసేలోపు ఇంకెన్ని విచిత్రమైన విషయాలు వెలుగులోకి వస్తాయో అంటూ అక్కడి ప్రజలు, నేతలు మాట్లాడుకుంటున్నారు.