ప్రపంచ దేశాలను కరోనా వణికిస్తూనే ఉంది. ఇన్ని రోజులు కేసులు కాస్త తగ్గుముఖం పట్టినా మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. అందుకే పలు దేశాలు లాక్ డౌన్ను మళ్లీ అమలు చేస్తున్నాయి. అయితే తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ నివేదికను విడుదల చేయగా.. అందులో భయంకరమైన నిజాలు బయటపడ్డాయి.
యూరప్ దేశాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. గత వారం ప్రపంచంలో నమోదైన కేసుల్లో సగం కేసులు యూరప్ దేశాల నుంచే నమోదైనట్లు పేర్కొంది.అక్కడ కరోనా మరణాలు కూడా ఎక్కువగానే ఉన్నాయంట. అంతకుముందు వారంతో పోలిస్తే 46 శాతం మరణాలు పెరిగినట్లు తెలిపింది. దీన్ని బట్టి అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. యూరప్లోని ఫ్రాన్స్, ఇటలీ యూకే తదితర దేశాల్లో ఎక్కువగా కేసులు నమోదయ్యాయి.
ఇక అమెరికాలో కూడా కరోనా మరణాలు 2 శాతం పెరిగాయి. కరోనా సెకండ్ వేవ్ అంటే ఇదేనేమో అంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక ఇండియాలో మాత్రం కరోనా కేసులు పెరుగుతున్నా రికవరీ రేటు మాత్రం ఎక్కువగానే ఉంది. ఇండియాలో 91 శాతం కరోనా రికవరీ రేటు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం మంగళవారం మొత్తం 59,540 మందికి కరోనా టెస్టులు చేయగా, వారిలో 6,725 మందిని పాజిటివ్గా గుర్తించారు. అంటే మొత్తం టెస్టులలో 11.29 శాతం మేరకు కరోనా వైరస్ ఉన్నట్లు స్పష్టమయ్యింది.
ఢిల్లీలో ఉష్ణోగ్రతలు తగ్గడం, చలి పెరగడం, పండుగల వాతావరణం ఇవన్నీ కరోనా కేసుల పెరుగుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో తిరిగి రోజుకు 12 వేల కరోనా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెరుగుతున్న కేసుల దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకునేందుకు ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.