బీహార్ ఎన్నికలు ఇద్దరు సీఎంల మధ్య మాటల యుద్దానికి దారితీశాయి. బీహార్ ముఖ్యమంత్రి నితిష్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్లు ఒకరిపై ఒకరు మాటల దాడులు చేసుకున్నారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో ఇది చోటుచేసుకుంది. కాగా ఇద్దరు ముఖ్యమంత్రుల్లో ఏ ఒక్కరూ పేరు ప్రస్తావించకుండానే మాట్లాడారు.
సీఎం నితీశ్, సీఎం యోగి ఆదిత్యనాథ్ బీహార్ ఎన్నికల వేదికగా విమర్శలు గుప్పించుకున్నారు. సీఏఏ విషయంలో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం చెలరేగింది. బిహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఓ ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. చొరబాటు దారు సమస్యకు ప్రధాని మోదీ ఓ పరిష్కారాన్ని కనుగొన్నారని చెప్పారు. సీఏఏ ద్వారా పాక్, అఫ్గనిస్తాన్, బంగ్లాలో హింసకు గురవుతున్న మైనారిటీల భద్రతకు ఆయన భరోసా ఇచ్చారని తెలిపారు. దేశభద్రతకు తూట్లు పొడచడానికి ప్రయత్నించిన ఏ చొరబాటుదారుడినైనా బయటికి పంపిస్తామని కేంద్రం స్పష్టం చేసిందన్నారు.
అనంతరం బీహార్ సీఎం నితీష్ కుమార్ ఈ వ్యాఖ్యలపై మండిపడ్డారు. అయితే యోగి పేరు ప్రస్తావించకుండా నితీష్ మాట్లాడారు. ఇలాంటి పిచ్చి మాటలు ఎవరు చెప్పారని..? ఇంతటి హానికరమైన ప్రచారాన్ని ఎవరు చేశారని..? ప్రజల్ని ఎవరు బయటికి పంపించేస్తారని..? ఇంతటి సాహసం ఎవరూ చేయలేరన్నారు. ప్రతి ఒక్కరూ ఈ దేశానికి చెందిన వారే. ప్రతి ఒక్కరూ భారతీయులే అన్నారు. ఐకమత్యం, సోదరభావంతో కలిసి పనిచేయడం వల్లే అభివృద్ధి సాధ్యం అన్నారు. దేశంలో విభజన తీసుకురావడానికే ఇలాంటి ప్రచారం చేస్తున్నారన్నారు. ఇద్దరు సీఎంల వ్యాఖ్యలు ఇలా ఉండటం పట్ల నేతలు చర్చించుకుంటున్నారు.