ప్రముఖ నటుడు సోనూసూద్ మానవత్వం చాటుకున్నారు. ఓ రైతు కుటుంబం పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్న ఆయన ఆదుకున్నాడు. అందరితో శభాష్ అనిపించుకున్నారు.
చిత్తూరు జిల్లా కె.వి పల్లి మండలం మహాల్ రాజపల్లి గ్రామంలో నాగేశ్వరరావు అనే ఓ రైతు తన ఇద్దరి కూతుళ్లతో కలిసి పొలం దున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది మొత్తానికి సోనూసూద్కి చేరింది. దీంతో సోనూ వెంటనే ట్విట్టర్ వేదికగా స్పందించారు. రైతులకు వెంటనే ఎద్దులు కొని ఇస్తానని తెలిపారు.
అయితే ఆ లోపే ఏం ఆలోచించుకున్నాడో ఏమో తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఎద్దులు కాదు ఏకంగా ట్రాక్టర్ కొనిస్తానని చెప్పారు. అలాగే బిడ్డల చదువు గురించి ఆలోచించాలని చెప్పారు. అనుకున్నదే తడువుగా మదనపల్లెలోని షోరూంలో ట్రాక్టర్ ఆర్డర్ చేశాడు. అనంతరం షోరూం వాళ్లు రైతుకు ట్రాక్టర్ అందజేశారు. తన మంచి మనసుతో రైతును ఆదుకున్నందుకు సోనూసూద్ ఇప్పుడు రియల్ లైఫ్లో హీరో అయిపోయారు. నెటిజన్లంతా ఇప్పుడు సోనూను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
అయితే ఇదే అంశం ఇప్పుడు పొలిటికల్ గా కూడా హాట్ టాపిక్గా మారింది. సదరు నాగేశ్వరరావు అనే రైతు సోనూసూద్ అనుకుంటున్నంత నిరుపేద వ్యక్తేమీ కాదని.. సరదాగా కుటుంబంతో వ్యవసాయం చేస్తుండగా ఇలా ఫోటోలు, వీడియోలు తీసుకున్నారని పలువురు చెబుతున్నారు. ఈయన గతంలో లోక్సత్తా పార్టీ తరుపున ఎన్నికల్లో పోటీ కూడా చేశారంటున్నారు. కాగా ఇలా ఊహించని విధంగా అందరూ స్పందించి చివరకు సోనూసూద్ ట్రాక్టర్ కొనిచ్చే వరకు విషయం వెళుతుందని వారు కూడా అనుకోలేదంటున్నారు.
చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ విషయంపై ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు స్పందించిన తీరు ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. చిత్తూరు జిల్లా వాసి అయిన చంద్రబాబుకు తన సొంత జిల్లాలో ఇలాంటి పరిస్థితి ఉంటే ఇంతవరకు తెలియకపోవడం దారుణమని పలువురు చర్చించుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తా అని చెప్పుకునే చంద్రబాబు.. నిజంగా అభివృద్ధి చేస్తే ఇలా కూతుళ్లతో వ్యవసాయం చేపించాల్సిన పరిస్థితి రైతులకు వచ్చి ఉండేదా అంటున్నారు. కేవలం పరువుపోతుందనే చంద్రబాబు చివర్లో కలుగజేసుకొని విషయంపై స్పందించి ఉంటారని మాట్లాడుకుంటున్నారు.